CJI Chandrachud | శ్రీశైలం, ఫిబ్రవరి 26 : జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివారం సీజేఐ, ఆయన సతీమణి కల్పనాదాస్ దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న సీజేఐ దంపతులతోపాటు సుప్రీంకోర్టు జడ్జి పీఎస్ నర్సింహ, ఆయన సతీమణి సత్యప్రభకు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణ మధ్య వేదపండితులు తిలకధారణ చేసి ఆలయ ప్రవేశం చేయించారు.
స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చనలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఆయన వెంట ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్ సుజన, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ మనజీర్ జిలాని సామూ న్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎస్పీ రఘువీరారెడ్డి ఉన్నారు.