మహబూబ్నగర్/హన్వాడ, మార్చి 17 : పేదలకు అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 42 మందికి రూ.31.05లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగానే సకల వైద్య సేవలు అందుబాటులో తీసుకొస్తామన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండేదికాదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జనరల్ దవాఖానలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు, నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రకాల వైద్య సేవలకు జనరల్ ఆసుపత్రి కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు. టీ హబ్ ద్వారా 50కి పైగా వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో గతానికి, ఇప్పటికీ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. పాత కలెక్టరేట్ స్థలంలో రూ.500 కోట్లతో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె మార్పిడి చికిత్స తదితర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానల తరహాలో వైద్య సేవలు స్థానికంగానే అందుతాయన్నారు. పేదల కోసం నిరంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామన్నారు. నియోజకర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామన్నారు. త్వరలో అమర్రాజా వంటి భారీ పరిశ్రమలు మహబూబ్నగర్లో ఏర్పాటు కానున్నాయన్నారు. అనంతరం అభివృద్ధి ప్రదాత పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, జనరల్ దవాఖాన మాజీ సూపరింటెండెంట్ శ్యామూల్, బీఆర్ఎస్ హన్వాడ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, కో ఆప్షన్ మన్నాన్, ఉప సర్పంచ్ గంగాపూరి, నాయకులు రమణారెడ్డి, ఖాజాగౌడ్, వెంకటయ్య, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.