మహబూబ్నగర్, జూన్ 13 : ధరణి.. సులువుగా స్లాట్ బుకింగ్.. వేగంగా రిజిస్ట్రేషన్కు కేరాఫ్.. ఎవరినీ బతిమిలాడే పరిస్థితి లేదు.. పైసా లంచం ఇచ్చే అవసరం లేదు.. దశాబ్దాల భూ సమస్యలకు చెక్.. భూ రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతిని అంతమొందించింది.. ఆన్లైన్లో పక్కాగా నమోదుతో భూమిని భద్రం చేసింది.. ఇలా చెప్పుకొంటూపోతే చాలానే ఉన్నాయి.. అంతటి అద్భుతమైన పోర్టల్ రైతుల తలరాత మార్చి వారి పాలిట వరంగా నిలిచింది. సులువుగా స్లాట్ బుకింగ్కు అవకాశం.. నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. వేగంగా మ్యుటేషన్తో కర్షకుల కష్టాలు తీరాయి. గతంలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పరిష్కారం కాని సమస్యలకు ధరణి చెక్ పెట్టిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలో 92,125 రిజిస్ట్రేషన్లు చేయగా.. ప్రభుత్వానికి రూ.141.39 కోట్ల ఆదాయం సమకూరింది. 45,782 అర్జీలకుగానూ 95 శాతం దరఖాస్తు లకు అధికారులు పరిష్కారం చూపారు. పారదర్శకతకు మారుపేరు ధరణి అని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు.
భూ సమాచారాన్ని పక్కాగా చేసి ఒక నిర్ధిష్ట మార్క్ను టచ్ చేసిన ఘనత ధరణికే దక్కుతుంది. ఈ పోర్టల్కు అంకుర్పారణ చేసి కేవలం నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్తోపాటు, మ్యుటేషన్ విధానాన్ని ప్రజలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. దేశంలోని మన రాష్ట్రంలోనే ధరణి సాధ్యమైంది. పారదర్శకంగా.. ఆన్లైన్లో పక్కాగా నమోదుతో ఈ పోర్టల్ దూసుకెళ్తున్నది.
92,125 రిజిస్ట్రేషన్లు ధరణి రిజిస్ట్రేషన్ అంటే మ్యాగీ చేసినంత ఈజీ అని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇంట్లో ఉండే ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. తర్వాత నేరుగా తాసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించవచ్చు. ఈ పోర్టల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పాలమూరు జిల్లాలో 92,125 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి నుంచి ప్రభుత్వానికి రూ.141.39 కోట్ల ఆదాయం సమకూరింది. భూ రికార్డుల సవరణల కోసం 45,782 అర్జీలు రాగా.. వీటిలో 95 శాతం దరఖాస్తులకు అధికారులు పరిష్కారం చూపారు.
భూ లెక్క తేల్చింది
భూ లెక్కను తేల్చింది ధరణి.. భూ పట్టాదారులకు పక్కా ప్రణాళికలను అమలు చేస్తూ నూతన పాస్పుస్తకాలను ముద్రించి భూ లెక్కను నిర్ధారించింది. ఎవరిపై ఎం త భూమి ఉన్నది.. అసైన్డ్ భూమి ఎంత ?.. ఇ లా ప్రతి విషయంలోనూ ల్యాండ్ వివరాలు ఆ న్లైన్లో నమోదు కావడంతో ఈ పోర్టల్ ప్ర త్యేకతను చాటుకున్నది. ఉమ్మడి రా ష్ట్రంలో పాలమూరు జిల్లాలో 2, 18,097 ఎకరాల్లో మాత్రమే భూమి సాగయ్యేది.. ప్రస్తుతం 1,33, 787 ఎకరాలు పెరిగి మొత్తం 3,51,884 ఎకరాలల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రతి ఒక్కరి భూ పట్టాదారులకు ఆర్థిక సాయం నుంచి భూ వివరాలను గోప్యంగా ఉంచడంతో ధరణి ప్రత్యేకం.
‘ధరణి’ తీస్తామంటే ఒప్పుకోం
ధరణి వచ్చినంక భూములు అమ్ముడు…కొనుడు చాలా మంచిగా ఉంది. మంచి చేయరు.. చేసెటోళ్లను ఆపుతరు. ఇదెక్కడి న్యాయం. ధరణితోనే కదా అందరి భూములు జర్రకంత భద్రంగా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు గతంలో భూములు తారుమారయ్యేవి. నేను పుట్టినప్పటి నుంచి ఇంత అభివృద్ధి ఎప్పుడూ చూడలే. తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ చేసి పాసుబుక్కు ఇస్తుండ్రు. గింత కంటే ఇంకేం కావాలి. అప్పట్ల రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత మ్యుటేషన్ కోసం ముప్పుతిప్పలు పెట్టేటోళ్లు. ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఠక్కున అయిపోతోంది. గింత మంచిదాన్ని తీసేస్తాం అంటే ఎట్లా? జర్ర ప్రజలకు మంచి జరిగేలా చూడాలయ్యా. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిగుంది. ధరణిని ఎప్పటికీ ఉంచాలే. సమస్యలుంటే పరిష్కారించాలి. అంతే కాని.. ధరణి తీస్తామంటే ఒప్పుకోం.
– మల్లేశ్, హన్వాడ మండలం
చాలా అవస్థలు పడ్డాం..
ధరణి లేకముందు భూముల విషయంలో చాలా అవస్థలు పడ్డాం. గతంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే జిల్లా కేంద్రానికి పరుగుపరుగున వెళ్లేవాళ్లం. రోజుల తరబడి పని వదులుకొని డబ్బులు ఖర్చు చేసినా పనయ్యేది కాదు. అక్కడ రిజిస్ట్రేషన్ తంతు అయిపోయాక.. మళ్లీ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లం. ఆఫీస్లో ఉన్న ప్రతీ సెక్షన్లో లంచం ఇస్తేనే పనయ్యేది. లేకుంటే ఫైలు మూలకు పడేది. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి లంచం లేకుండా పని జరుగుతున్నది. తాసీల్దార్ కార్యాలయంలో నిమిషాల వ్యవధిలో భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నది. మధ్యలో అధికారులు ఉండరు.. లంచం ఇచ్చే బాధ ఉండదు.. సమయం వృథా కాదు. కొంతమంది బ్రోకర్లకు పనిలేక ధరణిపై లేనిపోని అభాండాలు మోపుతున్నారు. ఇది తగిన పద్ధతి కాదు. రైతులకోసం ఇంత మంచి పని చేస్తున్న సర్కార్ను అభినందించాల్సింది పోయి విమర్శించడం తగదు. ధరణి రైతుల పాలిట వరంగా మారింది.
– లంబ పోచయ్య, రైతు, కొల్లూరు, నవాబ్పేట
ధరణిని తీస్తే తిప్పలు తప్పవు
మాది జడ్చర్ల మండలం నాగసాల గ్రామం. నాకు నాలుగెకరాల భూమి ఉంది. అదనంగా మా అన్న దగ్గర నుంచి 6 గుంటల భూమి కొన్నా. నాపేర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొన్న ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశా. తాసీల్దార్ కార్యాలయానికి మధ్యాహ్నం 12:30 గంటలకు వెళ్తే.. ఒంటి గంట కల్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది. వెంటనే పాస్బుక్లో ఎంట్రీ చేసి ఇచ్చారు. గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. పాసుపుస్తకంలో పొలం ఎక్కించాలంటే పదిహేను రోజులైనా పట్టేది. కొన్న భూమిని పాసుపుస్తకంలో ఎక్కించండంటూ ఆఫీసు చుట్టూ తిరిగేటోళ్లం. డబ్బులిస్తే గానీ పాస్బుక్కులో వివరాలు ఎక్కించ ని పరిస్థితి. ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు తిప్పలు తప్పాయి. ఒక్కపైసా ఖర్చు లే కుండా పని అయిపోయింది. సీఎం కేసీఆర్ సార్ ధరణి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. మా లాంటి రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ధరణి ని తీస్తే మళ్లీ తిప్పలు మొదలవుతాయి. ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్న ధరణిని కొనసాగించాల్సిందే.
ధరణితో ఎంతో మేలు
భూముల విషయంలో ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్తో మాకు మేలు జరుగుతున్నది. భూములకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను రెవెన్యూ అధికారులు అవసరమైతే గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడి అక్కడే పరిష్కరిస్తున్నారు. రైతులకు జవాబుదారీతనంగా ఉండేలా ధరణి పని చేస్తోంది. ముఖ్యమంత్రి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు
ప్రత్యేక ధన్యవాదాలు.
– నర్సింహయాదవ్, కేతిరెడ్డిపల్లి, రైతు, బాలానగర్ మండలం
సమర్థవంతంగా అమలు చేయాలి
ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నది. భూ యాజమానులకు సంబంధించిన భూమి కొనుగోలు, విక్రయాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా ముగుస్తున్నది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోర్టల్ పనిచేస్తున్నది. రైతులు, ప్రజలకు సమయ, దూర భారం తప్పింది. స్లాట్లు బుక్ చేసిన తర్వాత పెండింగ్లో ఉండకుండా తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. వచ్చిన అర్జీలలో 95 శాతం ఇప్పటికే పరిష్కరించాం. కోర్టు, ఇతర సమస్యల కారణంగా కొన్ని ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. మా పరిధిలోకి వచ్చిన ప్రతి భూ సమస్యకూ పరిష్కారం చూపుతాం.
– రవినాయక్, కలెక్టర్, మహబూబ్నగర్
రూపాయి లంచం లేకుండా పనైతున్నది..
మా ఊరిలో రెండున్నర ఎకరాలను కొనుగోలు చేశాను. నా పేర రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు 8వ తేదీన స్లాట్ బుక్ చేసుకున్నా. అయితే, వేరే పనులు ఉండడంతో స్లాట్ బుక్ చేసుకున్న తేదీన తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదు. మరుసటి రోజు ఆఫీస్కు వెళ్లి స్లాట్ బుక్ చేసిన కాగితాలను చూపించాను. అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ధరణి వచ్చాక బ్రోకర్లతో పని లేకుండా పోయింది. గతంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే జిల్లా కేంద్రానికి ప రుగు పరుగున వెళ్లేవాళ్లం. రోజుల తరబడి పని వదులుకొని డబ్బు లు ఖర్చు చేసినా పనయ్యేది కాదు. డాక్యుమెంట్ రైటర్లు పిలిచినప్పుడే అధికారి వద్దకు వెళ్లేవాళ్లం. తప్పని పరిస్థితుల్లో అడిగినంత డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అదంతా లేదు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫొటోలు, సంతకాలు పెడితే నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అవుతున్నది. ఆన్లైన్లోనే మ్యుటేషన్ అయింది. వారం రోజుల్లో ఇంటికే పాస్బుక్ వస్తుందని తాసీల్దార్ చెప్పారు. ధరణిపై ప్రతిపక్షాల నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదు.
– చిట్టెమ్మ, ఉదండాపూర్, జడ్చర్ల మండలం