నారాయణపేట, జూలై 31: దేశమంతటా నాగుల పంచమి జరుపుకొంటుండగా.. అక్కడ మాత్రం తేళ్ల పంచమి జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాదు తేళ్ల దేవతల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించడంతోపాటు ఆలయంలో తేళ్ల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ గ్రామస్తులు.. వినడానికి వింతగా ఉన్నా.. ఏండ్లుగా ఆ గ్రామంలో ఇదే ఆచారం కొనసాగుతూ వస్తుంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన తేళ్ల దేవత ఆలయం నారాయణపేట పట్టణానికి 25కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందూకూరు గ్రామ శివారులో ఉంది.
ఊరు.. ఊరంతా తేళ్ల జాతరే..
నాగుల పంచమి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పుట్ట వద్ద నాగుల విగ్రహాలకు, పుట్టలకు పూజలు చేసి పాలు పోయడం చూస్తుంటాం. అంతేగాక దేశవ్యాప్తంగా నాగుల పంచమి రోజున నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుపుకొంటుండగా ఇక్కడ మాత్రం తేళ్ల పంచమి నిర్వహిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అనాధి కాలం నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఊరు ఊరంతా ఈ సాంప్రదాయన్ని పండుగలా నిర్వహిస్తుండడం విశేషం. వీరికి తోడు పక్క గ్రామాల ప్రజలు సైతం పూజలు చేస్తుంటారు. అంతేగాక కొండపై ప్రత్యేకంగా తేళ్ల దేవతకు ఆలయం నిర్మించి అందులోని తేళ్లరూపంలో విగ్రహాలకు పాలు పోసి అచ్చం నాగుల చవితి మాదిరిగానే తేళ్ల పంచమి నిర్వహిస్తున్నారు.
తేళ్లతో వింత విన్యాసాలు…
బయట ఎక్కడైన తేలు కనిపించిందంటే చాలు కేకలు వేస్తాం.. తేలు కుడితే ఆ నొప్పి భరించడం ఎవరితరం కాదు. అంతటి ప్రమాదకరమైన తేళ్లను నాగుల పంచమి రోజున ఒంటిపై, నాలుకపై, ముఖంపై తేళ్లు వేసుకొని వాటితో సయ్యాటలాడటం అంటే నమ్మశక్యం కాదు. కానీ తేళ్ల పంచమి రోజున కందూకూరు తేళ్ల గుట్ట వద్దకు వెళ్లి చూస్తే తెలుస్తుంది గుట్టపై ఏ చిన్న రాయిని తీసినా, వాటి కింద తేళ్లు దర్శనమిస్తాయి. ఇలా కనిపించిన తేళ్లను చేతితో పట్టుకొని ఒంటిపై, ముఖంపై, నాలుకపై వేసుకొని యువకులు, చిన్నారులు విన్యాసాలు చేస్తుంటారు. చేతితో పట్టుకున్నా, శరీరంపై ఎక్కించుకున్నా, నాలుకపై ఉంచుకున్నా అవి మాత్రం ఎలాంటి హాని తలపెట్టవు. ఒకవేళ తప్పి కుట్టినా ఆలయంలోని విభూతిని పూస్తే తగ్గిపోతుందన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. ఈ వింతను ప్రత్యక్షంగా చూడటానికి తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి జనం పెద్ద ఎత్తున ఆలయానికి బారులు తీరుతుంటారు. దీంతో ఏటా నాగుల పంచమి రోజున కందుకూరు వద్ద జనం రద్దీ విపరీతంగా ఉంటుంది.
కందుకూరు గ్రామానికి ఇలా వెళ్లాలి
నారాయణపేట పట్టణం నుంచి యాద్గీర్కు వెళ్లే ప్రతి వాహనం కందుకూరు గ్రామం మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. నారాయణపేట నుంచి యాద్గీర్కు వెళ్లే బస్సులు కానీ, ప్రైవేట్ జీపుల్లో కానీ వెళ్లవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి అర గంటకు బస్సు, జీపు సౌకర్యం ఉంటుంది. కందుకూరు గ్రామ స్టేజీ వద్ద దిగిన వెంటనే గ్రామ సమీపంలోని కొండమవ్వ గుట్టపై కాలినడకన గుట్ట ఎక్కాల్సి ఉంటుంది.