Mahabubnagar | గద్వాల అర్బన్, ఏప్రిల్ 21 : ఇసుకాసురులు ట్రెండ్ మార్చారు. మా రూటే సపరేటు అన్నట్లు కొత్తకొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. ధరూర్ మండలంలోని నాగర్దొడ్డి, నెట్టెంపాడు గ్రామాల్లో కొందరు అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నాగర్దొడ్డి గ్రామానికి చెందిన ఒకరు.. కర్ణాటక రాష్ట్రం నారగడ్డ బూడదపాడు గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు తెరలేపినట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణానది తీర ప్రాంతాలైన అత్కూర్, సర్జాపురం, బూడిదపాడు తదితర గ్రామ శివారుల్లో పెద్దమొత్తంలో ఇసుకను డంప్ చేసినట్లు తెలుస్తున్నది. నదిలో మరబోట్లు నడిపే వ్యక్తులకు ఇసుకపై కన్ను పడింది. నదితీర ప్రాంతాల్లో నుంచి ఇసుకను తరలిస్తే అడిగే వారే లేరనే ఉద్దేశంతో ఇసుక అక్రమ రవాణాకు పూనుకున్నారు. కర్ణాటక ప్రాంతంలో ఉన్న నది ఒడ్డు వద్ద మరబోటులో ఇసుకను నింపి నది మీదుగా నాగర్దొడ్డి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ధరూర్, కేటీదొడ్డి మండలాల్లోని ఆయా గ్రామాలకు ఎలాంటి అనుమతి లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో మరబోటుల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఈ దందాపై గ్రామస్తులు పోలీసులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణా చేసే ఒక వ్యక్తి పోలీసులకు మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి సీరియస్ అయినట్లు తెలుస్తున్నది. అక్రమ రవాణా చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులు ఎం తటివారైనా వదిలిపెట్టం. ఇసుక తరలించే వ్య క్తులు తప్పనిసరిగా మైనింగ్ లేదా రెవెన్యూ అధికారులతో అనుమతులు తీసుకోవాలి. ఇష్టానుసారంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. నాగర్దొడ్డి ప్రాంతం లో ఇసుక అక్రమ రవాణా విషయంపై పూర్తి స్థాయి నిఘా ఉంచాం. ప్రజలు కూడా ఇసుక తరలించే వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలి.
– చంద్రశేఖర్, గద్వాల సీఐ