‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధాని కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిమల్లారెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారంవనపర్తి జిల్లా కేంద్రంలో జేఎన్టీయూహెచ్ కళాశాల, బీసీ వ్యవసాయ మహిళా కళాశాల తరగతుల ప్రారంభం, జేఎన్టీయూహెచ్ హాస్టల్ భవనానికి శంకుస్థాపన, ఐటీఐ, పీజీ కళాశాల నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ ఎనిమిదిన్నర ఏండ్లుగా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఇక్కడి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. మహిళా కళాశాల రాష్ట్రంలోనే మొట్టమొదటిదని, తెలంగాణలో ఏ నియోజకవర్గంలో కూడా వనపర్తిలో ఉన్నన్ని విద్యాసంస్థలు లేవన్నారు.
వనపర్తి, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ): ‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మల్లారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాకేంద్రంలో జేఎన్టీయూహెచ్ కళాశాల, బీసీ వ్యవసాయ మహిళా కళాశాల తరగతుల ప్రారంభం, జేఎన్టీయూహెచ్ హాస్టల్ భవనానికి శంకుస్థాపన, ఐటీఐ, పీజీ కళాశాల నూతన భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా కోచింగ్ సెంటర్ను వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నదే నా కల అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు, రహదారుల విస్తరణ చేసినట్లు చెప్పారు. దేశంలో 1030గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గురుకులాలను ఏటా జూనియర్, డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు.
విద్యార్థులకు భవిష్యత్లో ఉపయోగపడే కోర్సులు ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అందుకే మహిళా బీసీ గురుకుల కళాశాలల్లో ప్రత్యేకంగా వ్యవసాయ విద్యను బోధించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలను దూరదృష్టితో పెద్దఎత్తున సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారన్నారు. వనపర్తిలో విద్యాసంస్థల ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్కు ధన్యవాదాలు తెలిపారు. వనపర్తిలో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు 70ఎకరాల భూమి అవసరమున్నదని, మొదటి విడుతలో 35ఎకరాల భూమి అందజేయనున్నట్లు తెలిపారు.
మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ తదితర విద్యాసంస్థల కోసం అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకున్నామన్నారు. వనపర్తిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు పదెకరాల భూమిని పెద్దమందడి ప్రాంతంలో గుర్తించామన్నారు. ఎంపీ రాములు సూచనల మేరకు కేంద్రీయ విద్యాలయాల కోసం సహకరిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, రిజిస్ట్రార్ సుధీర్కుమార్, అదనపు కలెక్టర్లు ఆశిస్ సంగ్వాన్, వేణుగోపాల్, జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ఆర్డీవో పద్మావతి, తాసిల్దార్ రాజేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు తిరుమల మహేశ్, యూత్ నాయకుడు గణేశ్, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పిల్లలకు సీఎం కేసీఆర్ పాలనలో ఉన్నతవిద్య అందుతున్నదని పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే బలహీనవర్గాలు విద్యలో వెనుకబాటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో 60శాతం ఉన్న బీసీలకు విద్యను దూరం చేశారన్నారు. చదువులో వెనబడలేదని, వెనకబడేయపడ్డారని అన్నారు. చదువు అందుబాటులో లేక కూలీలయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు, ఏర్పాటు చేస్తున్న గురుకులాల్లో అన్నివర్గాల పేద విద్యార్థులు నయాపైసా లేకుండా ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారన్నారు. తెలంగాణ రాకముందు 19బీసీ గురుకులాలు ఉంటే తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ 310 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. విద్యార్థులకు మేనమామలా కేసీఆర్ రూపాయి ఖర్చలేకుండా చదివిస్తున్నారని అన్నారు. భవిష్యత్ ఉపాధి, ఉద్యోగావకాశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కోర్సులను మహిళా డిగ్రీ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల మొట్టమొదటిదని అన్నారు.
– పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్
వనపర్తిలో వనరులు ఉన్నాయని అందుకే అభివృద్ధి చెందుతున్నదని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంటు పరిధిలో సీఎం కేసీఆర్ వల్ల మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి జిల్లాను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అన్ని విద్యా సంస్థలు వనపర్తిలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. ఇతర ప్రాంతాలకు వనపర్తి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. త్వరలో నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాలకు కేంద్రీయ విద్యాలయాలు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
– నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు
అలంపూర్, డిసెంబర్ 19: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో సోమవారం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పూజలు చేశారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డికి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్కుమార్ అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారి ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ఈవో, చైర్మన్ మంత్రికి తీర్థప్రసాదాలను, జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి చిత్రపటాలను అందజేశారు. మంత్రి వెంట ఆర్డీవో రాములు, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, తాసిల్దార్ సుభాస్నాయుడు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని, కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ అని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాలన్నారు. అబద్ధాలతో బీజేపీ ఎనిమిదన్నరేండ్లుగా ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఇంకో ఏడాదిన్నర అయితే బీజేపీ పీడ విరగడవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి పథకాలు లేవన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల నిర్మించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ‘మన పార్టీ బీఆర్ఎస్, కాబోయే ప్రధాని కేసీఆర్’ లక్ష్యంతో ప్రజలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రధానిగా పగ్గాలు చేపడితే దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి జరుగుతుందన్నారు. వనపర్తిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి అన్ని విద్యాసంస్థలు తెచ్చారన్నారు.
వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అన్నిరంగాల్లో సమగ్రంగా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. బీసీ మహిళా వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు. వనపర్తి అభివృద్ధి కండ్లముందు కనిపిస్తున్నదన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి ఏది మాట్లాడినా దాని వెనుక ప్రజల ప్రయోజనం ఉంటుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతున్నదని అన్నారు. రాష్ట్రంలో 1153జూనియర్ గురుకుల కళాశాలలు, 83డిగ్రీ కళాశాలలు ఉన్నాయని వెల్లడించారు. రూ.20లక్షలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి విద్యార్థులను చదివిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రూ.3500కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నీళ్ల నిరంజన్రెడ్డిగా పేరు తెచ్చుకున్న వ్యవసాయ మంత్రికి, అన్ని విద్యాసంస్థలు తెచ్చినందుకు మరో పేరు పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేయలేదన్నారు. సమాజంలో పోటీ పడాలంటే ఇంగ్లిష్ విద్య తప్పనిసరి అని అన్నారు. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు.
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి