వానకాలం పంట పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. 11వ విడుత రైతుబంధు సాయం 26 నుంచి అందనున్నది. పెట్టుబడి సాయం రూపంలో ‘రైతుబంధు’వులా సీఎం కేసీఆర్ మారారు. ఉమ్మడి జిల్లాలో 11,24,633 మంది కర్షకుల ఖాతాల్లో రూ.1256.16 కోట్లు జమ కానున్నాయి. ఈసారి పోడురైతులకూ పథకం వర్తించనున్నది. అయితే కొత్తగా భూ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న రైతులూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అప్పులకోసం షావుకార్లు, వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీసే అవసరం లేకపోవడంతోరైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. పెట్టుబడి సాయంతో సాగు కష్టాలు దూరమవుతుండగా, పొలం పనుల్లో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు.
మహబూబ్నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు తీపి కబురు అందించింది. 26నుంచి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందజేసేందుకు సంసిద్ధమవుతున్నది. 11వ విడుత రైతుబంధు సాయానికి ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ అధికారులు లబ్ధిదారులను గుర్తించే పనిలో పడ్డారు ఈసారి కొత్తగా గిరిజన రైతులకు పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో వారికి కూడా రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 5వేల ఎకరాలకు కొత్తగా రూ. 25కోట్ల రైతుబంధు సాయం అందనున్నది.గిరిజన రైతులకు ఈసారి పెట్టుబడి సాయం అందనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలకరి ప్రవేశించింది. నైరుతి రుతుపవనాల రాకతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురువడంతో వానకాలం పంటలకు రైతు లు సిద్ధం చేస్తున్నారు. గతేడాది జూలైలో రైతుబంధు డబ్బులు అందగా ఈఏడాది ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
పంట సాగుకు అన్నదాతలు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభు త్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ప్రతి ఏడాది వానకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేస్తున్నది. ఇప్పటికే పదిసార్లు రైతుబంధు సాయాన్ని అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 తేదీ నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జయచేయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుబంధు సాయం రూ. 1256.16కోట్లు..
ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ. 5వేల చొప్పున ప్రతి ఏడాది రూ. 10వేలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు పథకం కింద ఎకరానికి వానకాలం, యాసంగి సీజన్లో కలిపి పెట్టుబడి సాయం అందించే పథకం ఒక తెలంగాణలోని అమలవుతున్నది. ఇప్పటికే 10 విడుతలుగా ప్రభు త్వం పెట్టుబడి సాయం అందించగా తాజాగా 11వ విడుత రైతుబంధును ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా వచ్చే దరఖాస్తులను కలుపుకొని రూ. 1256.16కోట్ల పెట్టుబడి సాయం కావాలని ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులు లెక్కలు వేశారు. ముందుగా ఎకరం లోపల భూమి ఉన్న రైతులకు రైతు బంధు సాయం అందనున్నది. దశల వారీగా మిగతా రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల మంది రైతులు తొలిరోజు రైతుబంధు సాయం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోడు భూములకూ రైతుబంధు..
రిజర్వు ఫారెస్ట్లో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. వారు సాగు చేస్తున్న పోడు భూములకు అధికారికంగా పట్టాలను అందించింది. అటవీ ప్రాంతానికి నష్టం కలగకుండా గిరిజనులకు పోడుపట్టాలని అందించడంతో దశాబ్దాల వారి కలను ప్రభుత్వం నెరవేర్చినట్లు అయ్యిం ది. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1956మంది రైతులకు 4,698 ఎకరాలను పట్టాలుగా చేసి ఇచ్చింది. వనపర్తి
జిల్లాలో 311మంది గిరిజన రైతులకు 379 ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లా లో 19 మందికి 22 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో ముగ్గురికి 8 ఎకరాలు పట్టాలు చేసి ఇచ్చింది. 2,289మంది రైతులకు 5377ఎకరాలను గిరిజనులకు పట్టాలు చేసి వారి కలను రాష్ట్ర ప్రభు త్వం నెరవేర్చింది. దీంతోపాటు ఈ ఏడా ది వానకాలం నుంచి పోడు రైతుల కు కూడా రైతుబంధు సాయం రూ.2.6 కోట్ల మేర అందించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు
11.24లక్షల మందికి పెట్టుబడి సాయం
ఉమ్మడి జిల్లాలో మొత్తం 11,24,623 మంది రైతులకు రైతుబంధు పథకం వర్తించనున్నది. సుమారు 21లక్షల ఎకరాలకు పంట సాయం అందించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 2,33,832 మంది రైతులకు రూ. 230.85కోట్ల్ల రైతుబంధు సాయం అందనుంది. నారాయణపేట జిల్లాలో 1,82,409 మంది రైతులకు రూ.231.06 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 354,654మంది రైతులకు రూ.377.47 కోట్లు, వనపర్తి జిల్లాలో 1,79,912 మంది రైతులకు రూ.184. 72 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,73,826 మంది రైతులకు రూ. 232.06 కోట్లు వానకాలం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించనున్నారు..
కొత్త దరఖాస్తులకు ఆహ్వానం..
భూములు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు రైతుబంధు సాయం కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు క ల్పించింది. ఈనెల 16వరకు రిజిస్ట్రేషన్లు చే సుకొని ధరణిలో నమోదు అయిన వారు ఈ సాయానికి అర్హులని తేల్చింది. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు సంబంధిత ఏఈవోకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతాబుక్ జిరాక్స్ ప్రతాలను అందజేయాలని మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్ సూచించారు.