మహబూబ్నగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో రైస్ ఇండస్ట్రీకి మహర్దశ పట్టింది. దీంతో మిల్లులు నష్టాల నుంచి లాభాలబాటలో పయనిస్తున్నాయి. కొత్తగా మిల్లులు పెట్టుకోవడానికి దరఖాస్తుల వెల్లువ కొసాగుతున్నది. అన్ని జిల్లాల్లో వానకాలం, యాసంగిలో టన్నుల కొద్దీ ధాన్యం మిల్లులకు చేరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యాని కొని మిల్లింగ్కు పంపడంతో ఏడాది పొడవునా మిల్లులు నడుస్తున్నాయి. సామర్థ్యాన్ని బట్టి మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుండటంతో గోడౌన్లన్నీ ధాన్యపురాశులతో నిండిపోతున్నాయి. నిరంతరం మిల్లింగ్ చేసినా.. వేల టన్నుల ధాన్యం వస్తూనే ఉన్నది. కూలీలకు డిమాండ్ పెరగడంతో ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొచ్చి షిఫ్ట్ పద్ధతిన పనులు చేయిస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తున్నది. ఎనిమిదేండ్ల కింద మూతపడిన మిల్లులు సైతం పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 130, వనపర్తి జిల్లాలో161, నాగర్కర్నూల్ జిల్లాలో 95, జోగుళాంబ గద్వాల జిల్లాలో 60, నారాయణపేట జిల్లాలో 61మిల్లులు రన్నింగ్లో ఉన్నాయి. తెలంగాణ రాకముందు కేవలం 206 మిల్లులు ఉండగా ఇప్పుడు డబుల్ అయ్యాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేశాక.. బియ్యాన్ని కొనడానికి ఎఫ్సీఐ నానా కొర్రీలు పెడుతున్నదని మిల్లర్లు వాపోతున్నారు.
దూసుకుపోతున్న రైస్ ఇండస్ట్ట్రీ
తెలంగాణ రాకముందు కరెంట్ కోతలు.. సరైన సమయంలో వర్షాలు కురవక, సాగునీరు లేక, అప్పు సప్పు చేసి పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలేక రైతులు సరుకును దళారులకు అమ్ముకున్న సందర్భాలెన్నో.. ధాన్యం రాక మిల్లులను ఫంక్షన్హాళ్లుగా మార్చుకున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు నిరంతర విద్యుత్, విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా చేసి పెట్టుబడి సహాయం అందిస్తుండడంతో పాలమూరు సస్యశ్యామలమై పచ్చదనం పర్చుకున్నది. ఎక్కడా చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాల్లో రైసుమిల్లుల పంట పండింది. ఏటా సీజన్లో పెరుగుతున్న దిగుబడితో మిల్లులు నిరంతరం నడుస్తున్నాయి. ఈ ఎనిమిదేండ్లలో కొత్తగా 301 మిల్లులు ఏర్పాటు కాగా మరో 53 మిల్లులకు దరఖాస్తులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
కొని.. మిల్లింగ్కు పంపిస్తూ..
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ధాన్యం రికార్డుస్థాయిలో పండుతున్నది. గతేడాది వానకాలంలో పదహారు లక్షల ఎకరాల్లో సాగు చేయగా అందులో తొమ్మిదిలక్షల ఎకరాల్లో వరి సాగు చేశారంటే పరిస్థితి ఊహించవచ్చు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికావడం.. కాలువలు ఆధునీకరించడం, చెక్డ్యామ్లలో నీటిని ఒడిసిపట్టడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సివిల్ సైప్లె అధికారులు కస్టమ్ మిల్లింగ్ కింద రైసుమిల్లులకు పంపిస్తున్నారు. రైతుల వద్ద వందశాతం కొనుగోళ్లతో మిల్లులకు ధాన్యం పోటెత్తుతున్నది. ప్రొక్యూర్ చేసి పంపిన ధాన్యంలో క్వింటాకు మిల్లుల బాయిల్డ్ రైస్ అయితే అరవైఐదు కేజీలు, రా రైస్ అయితే అరవై కిలోల చొప్పున మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 507మిల్లులుకు ప్రభుత్వం ధాన్యాన్ని సరఫరా చేస్తున్నది.
కొనుగోళ్లకు కొర్రీలు పెడుతున్న ఎఫ్సీఐ
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని బియ్యంగా మార్చితే.. కొనుగోలు చేయడానికి ఎఫ్సీఐ అనేక కొర్రీలు పెడుతున్నది. బియ్యానికి పేర్లు పెడుతూ కొనడానికి ఆసక్తి చూపడం లేదు. నిబంధనల ప్రకారం బియ్యం కొనాల్సింది పోయి బాయిల్డ్ రైస్ వద్దు.. రా రైస్ కావాలి అంటూ అధికారులు సతాయిస్తున్నారని వ్యాపారవేత్తలు చెబుతునారు.
వేలాది మందికి లబ్ధి
పండించిన పంటను వందశాతం సివిల్ సైప్లె అధికారులు దగ్గరుండి ప్రొక్యూర్ చేసి మిల్లర్లకు అప్పగిస్తున్నారు. మిల్లింగ్ చేసిన నెలకు బియ్యాన్ని తిరిగి గవర్నమెంట్కు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వమే బి య్యాన్ని తీసుకుంటే ఇబ్బందులుండవు. కేంద్రప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ నానా కొర్రీలు పెట్టి బియ్యాన్ని కొనడం లేదు. దీంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల రైసు మిల్లులకు ఏడాది పొడవునా పని ఉంటోంది. మా ఇండస్ట్రీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
– కృష్ణయ్య, రైస్మిల్లుల సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్
మిల్లులు బాగుపడ్డాయి..
రాష్ట్రప్రభుత్వం రైతులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చినందుకే వ్యవసాయం ఊపందుకున్నది. ఏటా వరి ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోంది. ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేయడం.. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల చాలామందికి ప్రయోజనం చేకురుతున్నది. పాలమూరు జిల్లాలో గత వానకాలంలో సుమారు రెండులక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మిల్లర్లకు నిరంతరం పని ఉంటోంది. మూతపడిన మిల్లులు సైతం తెరుచుకున్నాయి.
– చెరుకుపల్లి రాజేశ్వర్, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్