మహబూబ్నగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాడు కరెంటు కోసం పడిన గోస అం తాఇంత కాదు. ఎప్పుడొస్తుందో తెలియక పొలాల వద్ద జాగరణ.. వాణిజ్య కేంద్రాల ముందు జనరేట ర్ల మోత.. విద్యుత్ సరఫరా లేక చిన్న పరిశ్రమలన్నీ మూత.. గ్రామాలకు వెళ్లడానికి విద్యుత్ సిబ్బంది సైతం జంకిన రోజులవి.. సబ్ స్టేషన్లు, విద్యుత్ కా ర్యాలయాల వద్ద పోలీసుల బందోబస్తు.. భారీ పరిశ్రమలకు పవర్ హాలిడేలు.. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ కోసం పడిన కష్టాలు.. ఎండాకాలం వ స్తే చాలు మంచినీటి ఎద్దడి, కరెంటు కోసం రైతుల ధర్నాలు.. రాస్తారోకోలతో దద్దరిల్లేవి.. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్ర భుత్వం విద్యుత్పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంలో సఫలీకృతమైంది. ఇటు రైతాంగం.. అటు చిన్న, భారీ తరహా పరిశ్రమలు ఊపిరి పీల్చుకున్నా యి. రైతులకు సరిపడా నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా లో 9 ఏండ్లుగా కరెంటు కోతల మాటే లేదు. పొలా ల వద్ద పడిగాపులు బంద్ కాగా.. సెల్ఫోన్లో ఇంటి వద్దే ఉండి మోటర్ ఆన్, ఆఫ్ చేసే టెక్నాలజీ రైతుల సొంతమైంది.. చిన్న, భారీ పరిశ్రమలు 24 గంట లు నడుస్తున్నాయి. పక్క రాష్ట్రంలోని పల్లెలు గతం లో దగదగా మెరవగా.. నేడు చీకటిమయమయ్యా యి. ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ వెలుగులు నిం డగా కర్ణాటక జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ లాంటి నాయకుడిని మళ్లీ ఆదరించాలని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు..
ధాన్యాగారంగా పాలమూరు..
నాణ్యమైన విద్యుత్ సరఫరాతో అన్నదాతలు సాగు సంబురంగా చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదులక్షలకు పెరగని సాగు విస్తీర్ణం.. తొమ్మిదేండ్ల లో 14 లక్షలకు పెరిగి 20లక్షలకు ఎగబాకుతున్నది. తెలంగాణ వచ్చినంక ఉమ్మడి జిల్లా ధాన్యాగారమైం ది. ఇతర రాష్ర్టాల నుంచి వలసొస్తున్న కూలీలతో వలస జిల్లా పేరు తుడిచి పెట్టకుపోయింది. ఇదంతా కేసీఆర్ పుణ్యమే అని రైతాంగం అంటోంది.
చిన్న, భారీ పరిశ్రమలకు నిరంతర విద్యుత్..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు వెలుస్తున్నాయి. గతంలో విద్యుత్ కోత కారణంగా చాలా పరిశ్రమలు యూనిట్లను మూసివేసి పట్నాల బాట పట్టాయి. ఇప్పుడు ప్రభుత్వం నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తుండడంతో అన్ని రకాల పరిశ్రమలు పోటీపడి నెలకొల్పుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో రూ.9,500కోట్లతో అమర రాజా లిథియం బ్యాటరీ పరిశ్రమకు శంకుస్థాపన పడింది. మూసాపేట మండలంలోని ఓ గ్లాస్ పరిశ్రమలో మరో యూనిట్కు రూ.500కోట్లతో కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భూత్పూర్ వద్ద 150 ఎకరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దివిటిపల్లి ఐటీ హబ్లో ఐటీ కంపెనీలతోపాటు మిగతా పరిశ్రమలు క్యూ కట్టడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదంతా నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్లే సాధ్యమైందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు..
ఆగిన జనరేటర్ల మోత..
గతంలో ఏ షాపు దగ్గరికి వెళ్లినా వాటి ముందు పెద్ద జనరేటర్లు దర్శనమిచ్చేవి. రైస్ మిల్లుల వద్ద పవర్ జనరేటర్లను నెలకొల్పేవారు. విద్యుత్ సంస్థల ఇచ్చే యూనిట్ కాస్ట్ కన్నా పదింతలు ఎక్కువైనా వ్యాపార సంస్థలు భరించేవి. ఆ డబ్బులను వినియోగదారుల నుంచి వసూలు చేసేవారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. వ్యాపార సముదాయాల ముంగిట జనరేటర్ల మోతలు ఆగిపోయాయి. గతంలో షాపు పెడితే ఇన్వైటర్, జనరేటర్ తప్పకుండా కొనాలి. తెలంగాణ వచ్చాక ఇంత మేలు జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని వ్యాపార, వాణిజ్య వర్గాలు అంటున్నాయి.
ఏ పార్టీలను నమ్మం..
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విద్యుత్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఆ పార్టీలను నమ్మే పరిస్థితి ఉండదని అన్ని వర్గాలు అంటున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని, తెలంగాణలో ఎట్లా ఇస్తున్నారు? అని బంధువులు వాకబు చేస్తున్నారని రైతులు, వ్యాపారస్తులు అంటున్నారు. అధికారం కోసం ఆయా పార్టీలు ఇచ్చే హామీలను గుడ్డిగా నమ్మబోమని తేల్చి చెబుతున్నారు. గతంలో విద్యుత్ పాలసీ విషయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారేవని.. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యుత్ విషయంలో చేపట్టిన సంస్కరణలు, పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల అన్ని రంగాలు బలోపేతమయ్యాయని రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న విద్యుత్ పాలసీ దేశంలో మరెక్కడా లేదని, మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రావాలని కోరుకుంటున్నారు.
నానా అవస్థలు పడ్డాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఉదయం 9 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వచ్చేది. పనులు లేక పస్తులున్నాం. రైతులు కూడా పొలానికి నీరు పారించేందుకు ఎన్నో ఇబ్బందులు పడేటోళ్లు. రాత్రి పూట లోవోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోతే మా వద్దకు తీసుకొచ్చేవారు. లేత్ మిషన్పై పని చేసేందుకు కూడా కరెంట్ లేకపోవడంతో వాళ్ల పంటలు ఎండిపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంట్ తిప్పలు తప్పడంతో ఎప్పటికప్పుడు మోటర్లు బాగుచేసి రైతులకు ఇస్తున్నాం. ప్రస్తుతం మోటర్లు కాలిపోయో పరిస్థితి కూడా లేదు. 24 గంటల నాణ్యమైన కరెంట్ రైతులకు, గ్రామాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక మేం పడిన కష్టాలు జీవితంలో మరిచిపోం. తెలంగాణ ప్రభుత్వం రైతులు, చిన్న వ్యాపారులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుండడం హర్షనీయం. ఈ ప్రభుత్వనికి అందరం రుణపడి ఉంటాం.
– ఆనంద్, లేథ్ మిషన్ వర్కర్, మరికల్, నారాయణపేట జిల్లా
మేమంతా.. సీఎం కేసీఆర్ వెంటే..
మాకు గద్వాల పట్టణంలో కట్టెలకోత మిషన్ ఉన్నది. మొద్దులు కోయడానికి లేబర్ వచ్చేవారు కానీ.. కరెంట్ ఉండేది కాదు. లో ఓల్టేజీ వల్ల చాలా ఇబ్బందులు పడెటోళ్లం. ఒక్కోసారి పని జరగకపోయినా కూలీలకు పైసలు చెల్లించాల్సిన పరిస్థితి. సకాలంలో పనులు జరగక కస్టమర్లతో మాటలు పడాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పరిశ్రమలకు పవర్హాలిడేలు లేవు. పని సజావుగా సాగుతున్నది. ఎప్పుడైనా పనిచేసుకునే అవకాశం ఉన్నది. విద్యుత్ విషయంలో పక్క రాష్ర్టాల కంటే తెలంగాణలో ఎంతో మేలు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం మన అదృష్టం. గృహావసరాలకు కరెంట్ కోతలు లేవు. కేసీఆర్ వంటి నిఖార్సైన నాయకుడి వెంట ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించుకుందాం..
– మాజ్, కట్టెలకోత మిషన్ నిర్వాహకుడు, గద్వాల
ఇబ్బందులు తప్పినయ్..
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. 12 ఏండ్ల కిందట మా నాన్న వనపర్తిలో ఫ్లె క్సీ షాప్ను ప్రారంభించారు. పెద్ద ఎ త్తున మిషన్లు తీసుకొచ్చాం. కానీ కరెం టు ఎప్పుడు ఉంట దో.. ఎప్పుడు పోత దో తెలియకపోయేది. ఒకసారి ప్రింట్ ఇస్తే మధ్యలో కరెంటు పోతే అప్పటి వరకు చేసిన పనంతా వృథా అయ్యేది. పని మధ్యలో ఆగకుండా ఉండేందుకు ఇన్వర్టర్, బ్యాటరీలు తెచ్చుకున్నాం. రాత్రి మొదలు తెల్లవారుజాము వరకు పని చేసుకునే వాళ్లం. ఇలా కరెంటు వచ్చినప్పుడు ఫ్లెక్సీ ప్రింట్లను వేసేవాళ్లం. అంతవరకు బ్యాటరీల సహాయంతో కంప్యూటర్లో ఫ్లెక్సీలకు డిజైన్ చేసే వాళ్లం. అర్జెంట్గా కావాలని ఎవరైనా వస్తే ఆ సమయంలో కరెంటు లేకపోతే ప ని వదులుకునే వాళ్లం. ఈ పరిస్థితులను చాలా దగ్గ రి నుంచి చూశాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కరెంటు సమస్య లేదు. దీంతో షాప్లో కంప్యూటర్ వద్ద పనిచేసే వాళ్ల సంఖ్యను పెంచాం. వాళ్లు ఉదయం వచ్చి రాత్రి వరకు పని చేస్తున్నారు. నిరంతరం కరెంటు అందిస్తున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– అహ్మద్, ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్, వనపర్తి
రైతు రాజ్యాన్ని కాపాడుకోవాలి..
దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ రైతాంగం వెన్నంటే ఉండాలి. కేసీఆర్ పాలన రైతుల పాలిట స్వర్ణయుగం. కోతలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తూ బీడు భూములను సైతం సాగులోకి తెచ్చిండు. 2014కు ముందు కరెంటు ఎప్పుడు వస్తుండెనో! ఎప్పుడు పోతుండెనో తెల్వకపోయేది. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఇండ్ల వద్ద కన్నా, పొలాల కాడనే ఎక్కువ సమయం గడిపేవాళ్లం. పాములు, తేళ్లకాటుకు గురై ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయం తప్ప వేరే పని ఎరుగని మాకు కన్నీల్లే మిగిలేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తున్నది. దీంతో రాత్రి పూట పొలం కాడికి పోయే పని తప్పింది. గత ప్రభుత్వాల హయాంలో మా జీవితాల్లో కారుచీకట్లు కమ్ముకోగా.. నేడు వెలుగులు నిండాయి. వ్యవసాయం దండగా అన్నచోటే పండుగగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలిచి ముచ్చటగా ముడోసారి కేసీఆర్ను సీఎంగా గెలిపించుకుంటాం.
– బక్షి హనుమాన్రావు, రైతు, నర్సింగాపురం, మదనాపురం.
పవర్ మిషన్తో ఆదాయం పెరిగింది..
పదేండ్ల కిందట కరెంట్ ఎప్పు డు వస్తదో! ఎప్పుడు పోతదో తెల్వకుండే. ఉన్న రెండు, మూడు గంటలకే వచ్చే కరెం ట్ బిల్లును చూస్తేనే గుండె ద డ పెరిగేది. మేము చేనేత కార్మికులం. మూప్పై ఏండ్లుగా మ గ్గం మీదే ఆధారపడి బతుకుతున్నం. మాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మాయికి పెళ్లి చే శాం. అబ్బాయి బీటెక్ చదివి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మా అమ్మానాన్నలు కూ డా మగ్గం పనిచేసేవారు. గతంలో చేనేత చీరలను మగ్గంపైనే నేసేవాళ్లం. కాలక్రమం గా వాటికి మార్కెట్లో ఆదరణ తగ్గడంతో జాకర్టుతో వివిధ రకాల డిజైన్లు వేసి చీరలను తయారు చేసేవాళ్లం. కానీ జాకర్టును తొక్కుతూ డిజైన్ వేయడం చాలా కష్టంతో కుడుకున్న పని. పొద్దస్తమానం పని చేస్తే మా ఇద్దరికీ కలిపి రోజుకు కనీసం మూడువందలు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు జాకర్టుకు పవర్ మిషన్ ఏర్పాటు చేసుకోవడంతో కష్టం తగ్గింది. పనిలో స్పీడ్ పెరిగి నెలకు రెండు, మూడు చీరలు తయారు చేసి ఆదాయం పొందుతున్నాం.
– తిరుమల శ్రీనివాసులు దంపతులు, అమరచింత
కార్మికులకు పట్టెడన్నం పెడుతున్నం..
గతంలో విద్యుత్ కోత వల్ల చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇబ్బంది పడేవారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందోననే అయోమయంలో ఉండేవారు. అందువల్ల కార్మికులకు వేతనాలు చెల్లించలేక దివాలా తీసేవారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం 24 గంటల విద్యుత్తో చిన్న పరిశ్రమలకు ఊతమచ్చింది. విద్యుత్కు అంతరాయం లేకపోవడంతో పరిశ్రమకు వచ్చే కూలీలకు పట్టెడన్నం పెట్టగలుగుతున్నాం. ఇతర రాష్ర్టాల నుంచి కూడా కూలీలు పరిశ్రమలను వెతుక్కుంటూ వస్తున్నారు. కరెంట్ సరిగ్గా లేకపోతే వ్యాపారాలు సాగవు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
– శ్రీనివాసులు, కొత్తకోట
కరెంటు కష్టాలు పోయినయ్..
నా పేరు కె.అశోక్. మాది జడ్చర్ల మండలం ఆలూర్ గ్రామం. పదేండ్లుగా జడ్చర్లలోని సిగ్నల్గడ్డ వద్ద శ్రీలక్ష్మీ ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ వర్క్ దుకాణం నడిపిస్తున్నా. కరెంటుతోనే లేథ్ మిషిన్ పని జరుగుతది. ఒకప్పుడూ లేథ్ మిషిన్ షాపులో వర్కర్గా పని చేసేవాడ్ని. తెలంగాణ రాక ముందు గంటకోసారి కరెంటు పోయేది. దీంతో పనికి అంతరాయం కలిగేది. కస్టమర్లు ఎన్నిరోజులు పనిచేస్తావంటూ నాపై కోప్పడేవారు. ఎండాకాలంలో కరెంటు లేక దుకాణాలు మూసివేసేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తోంది. లేథ్ మిషిన్ పని సకాలంలో చేస్తున్నాం. ఇప్పుడు నాతోపాటు ముగ్గురు పనిచేస్తున్నారు. ఒక్కో వర్కర్కు రూ.10వేలు జీతం ఇస్తున్నా. వర్కర్లకు జీతాలు పోనూ నాకు నెలకు రూ.20వేలు మిగులుతున్నాయ్. కరెంటు తిప్పలు లేనందుకే పనులు సకాలంలో పూర్తి చేసి డబ్బులు సంపాదించుకుంటున్నా. ఇతర రాష్ర్టాల్లో కరెంటు కోతలు ఉన్నాయని పత్రికల్లో చదువుతున్నాం. ఆ బాధలు మాకు తప్పినయ్.
– కె.అశోక్, లేథ్మిషన్ షాపు నిర్వాహకుడు, జడ్చర్ల టౌన్
ఫోనొస్తే భయపడేవాళ్లం..
గతంలో ఎప్పుడు, ఎక్కడ విద్యుత్ సమస్యవస్తుందోనని భయపడేవాళ్లం. కరెంటు పోయినప్పుడు ప్రజల ఫోన్ చేస్తే ఎత్తి సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడేవాళ్లం. నిరంతర కోతలతోపాటు లోఓల్టేజీ సమస్య ఎక్కువగా ఉండేది. దీంతో చీటికిమాటికి ట్రాన్స్ఫార్మర్లలో సమస్యలు తలెత్తేవి. కరెంట్ కోసం రైతులు సబ్స్టేషన్లను ముట్టడించేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం విద్యుత్ అందించడంతో సమస్యలు సద్దుమణిగాయి. ఇప్పుడు విద్యుత్ శాఖలో పనిచేసేవారు ప్రశాంతంగా ఉండొచ్చు. రైతులు, గృహవినియోగదారులు, పరిశ్రమలకు పవర్ కట్ లేకుండా నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం అందిస్తున్నది. ఇటువంటి నాయకులు, ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే అందరికీ మేలు కలుగుతుంది. లేదంటే ఇబ్బందులు పడతాం. పక్క రాష్ట్రం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయలేక అవస్థలు పడుతున్నది. మనం వారికి అధికారం కట్టబెడితే విద్యుత్ సమస్యలు తప్పవు.
– పుల్లయ్యగౌడ్, స్వామి, రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులు, గద్వాల
తెలంగాణతో కోతలు తప్పినయ్..
కేసీఆర్ వచ్చాక కరెంట్ కోతలు లేవు. లోవోల్టేజీ సమస్య లేదు. రాజకీయాలు ఏవైనా వాస్తవాలు చెప్పుకోవాలి. కరెంట్ నిత్యం ఉండడంతో తీరిక లేకుండా పిండిగిర్ని పడుతుంటా. గతంలో కరెంట్ ఎప్పుడొచ్చేదో! ఎప్పుడూ పోయేదో అంతుపట్టేది కాదు. కరెంట్ లేక రోజుల పాటు గిర్ని వద్దనే గింజలు ఉంటుండే. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఏ టైంలో గింజలు తీసుకొచ్చినా వెంటనే పిండి పట్టించి పంపుతున్నా..
– డీ.కే.మూర్తి, పిండిగిర్ని, యజమాని, కొల్లాపూర్
ఎదురు చూడాల్సిన పనిలేదు..
నేను గద్వాల పాతబస్స్టాండ్ వద్ద లేథ్ మిషన్ ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నా. గతంలో కరెంట్ సరిగ్గా ఉండకపోయేది. ఒక్కోసారి పనివారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది. లో ఓల్టేజీ సమస్య వల్ల పనులు సాగేవికావు. ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురైన ఘటనలూ ఉన్నాయి. అనుకున్న సమయంలో వారి పని చేయకపోతే మాటలు పడాల్సి వచ్చేది. తెలంగాణ ఏర్పాటుతో ఇబ్బందులు తప్పినయ్. ఎప్పుడైనా పని చేసుకోవచ్చు. కరెంట్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. ఎటువంటి లో ఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి ఎంతో మేలుగా ఉంది. పరిశ్రమలు, రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మనతోనే ఉండాలి. గతంలో కరెంట్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వారి వెంటే మేముంటాం.
– వాజిద్, లేథ్ మిషన్ నిర్వాహకుడు, గద్వాల
కండ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం..
కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంట్ కోసం రోడ్లుపైకి వచ్చి ధర్నాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. భార్యాపిల్లల్ని వదిలి పొలాల కాడనే నిద్రపోయేవాళ్లం. ఒక్కోసారి కరెంట్ ఉన్నా లోఓల్టేజీ సమస్య వేధించేది. దీంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయిన ఘటనలున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తుండడంతో తిప్పలు తప్పాయ్. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ర్టాల్లోని రైతులు, ప్రజలు, పరిశ్రమల నిర్వాహకులు కరెంట్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. అక్కడి సమస్య తీర్చలేని వారు ఇక్కడ వచ్చి ఏమి చేస్తరు. మాకు నిరంతరం కరెంట్ అందిస్తున్న కేసీఆర్ సార్ను మళ్లీ గెలిపించుకుంటాం.
– ఆంజనేయులు, రైతు, కేటీదొడ్డి
తెలంగాణ వచ్చినంకనే ఉచిత కరెంటొచ్చె..
గతంలో ఏ ప్రభుత్వ మూ పంటలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. ఉ మ్మడి పాలనలో సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏడు గంటల కరెంటు ఇచ్చారు. కానీ ఎప్పు డు వస్తదో తెలిసేది కాదు. రైతులు పొలాల వద్దే కాపలా కాసేటో ళ్లు. సగం పంట తడిసేలోపు కరెంటు పోయేది. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. విద్యుత్ సబ్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తుండటంతో సంతోషంగా పంటలు పండించుకుంటున్నాం. ఉచితంగా కరెంటు ఇస్తున్న కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– నర్సింగ్రావు, రైతు, బాలానగర్