మహబూబ్నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆందోళనలు నిర్వహిం చారు. గురువారం నర్సంపేటలో కార్మికుడు శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో నిరసనలు మిన్నంటాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్బంధాలు విధిస్తున్నా.. వాటిని లెక్క చేయకుండా కార్మికులు ధర్నాల్లో పాల్గొంటున్నారు.
వనపర్తి, కొల్లాపూర్, కల్వకుర్తితోపాటు పలు చోట్ల భారీ మానవహారాలు నిర్వహించారు. పాలమూరుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మౌన ప్రదర్శన నిర్వహించారు. సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. కల్వకుర్తిలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి, నాగర్కర్నూల్లో రాష్ట్ర నేత నాగం శశిధర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, పీఆర్సీ వెంటనే అమలు చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం ఎంత నిర్బంధం విధించినా అంతకన్న రెట్టింపు వేగంతో ఉద్యమం కొనసాగి స్తామని పలువురు కార్మికులు హెచ్చరించారు.