నాటి కరువు నేలన నేడు సాగుజలాలు తాండవం చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కృష్ణ, తుంగభద్ర, భీమా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం గేట్ల నుంచి జూరాలకు.. శ్రీశైలానికి వరద పరుగులు పెడుతున్నది. ఇప్పటికే లిఫ్ట్ల నుంచి ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, బండ్ల కృష్ణమెహన్రెడ్డి పంపింగ్ను ప్రారంభించారు. దీంతో భీమా ఫేజ్-1, ఫేజ్-2, కోయిల్సాగర్, నెట్టెంపాడు, సంగంబండ, భూత్పూరు రిజర్వాయర్లతోపాటు రామన్పాడు, కోయిల్సాగర్ , ఎంజీకేఎల్ఐ పరిధిలోని రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయి. దుందుభీ నది, బండ్రవల్లి, ఊకచెట్టు, కందూరు వాగులపై చెక్డ్యాంలకు కిలోమీటర్ల పొడవునా నీరు నిలిచి జలసిరులను సంతరించుకున్నాయి. ఎంజీకేఎల్ఐ నుంచి నీటి విడుదల ప్రారంభం కాకముందే గతేడాది నీరు.. ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇక రేపో.. మాపో ‘పాలమూరు’ నుంచి సాగునీటి విడుదలకు రంగం సిద్ధమైంది. 400 కేవీ హెవీ లైన్కు ట్రయల్న్ నిర్వహించారు. ఆర్డీఎస్ తూంలకు కొత్త షెట్టర్లను బిగించడంతో ఈ సారిసాగు విస్తీర్ణం పెరగనున్నది.
– మహబూబ్నగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఐదు జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర, భీమా నదులకు వరద పోటెత్తింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో వారం రోజుల కిందే డ్యాం స్పిల్వే గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మూడ్రోజుల కింద గేట్లను మూయగా.. మళ్లీ ఇన్ఫ్లో నమోదవుతుండడంతో మళ్లీ మూడు గేట్లను తెరిచారు. దీంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. జీవనది కృష్ణమ్మ పరవళ్లతో రైతు ఇంట సంతోషం నెలకొన్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి 15 రోజులుగా కంటిన్యూగా వరద వస్తున్నండగా జూరాల డ్యాం వద్ద స్థిరంగా నీటిమట్టం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువగా వస్తే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక భీమా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. తుంగభద్రకు ఇన్ఫ్లో నమోదవుతుండడంతో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతున్నది. అలాగే పాలమూరు, నాగర్కర్నూల్ జిల్లాల వరప్రదాయిని దుందుభీ పరవళ్లు తొక్కుతున్నది.
నిరంతరం ఎత్తిపోత
కృష్ణా, తుంగభద్ర, భీమా నదులకు భారీగా వరద వస్తుండడంతో ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్ ప్రారంభించారు. భీమా ఫేజ్-1, ఫేజ్-2, కోయిల్సాగర్, నెట్టెంపాడు లిఫ్టులకు పంపింగ్ కొనసాగుతున్నది. సంగంబండ, భూత్పూరు రిజర్వాయర్లు నిండడంతో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. భీమా ఫేజ్-2 పరిధిలోని ఏనుకుంట, రంగసముద్రం, శంకరసముద్రం, కృష్ణసముద్రం రిజర్వాయర్లన్నీ ఫుల్ అయ్యాయి. జూరాల ఎడమగట్టు కాలువ కింద ఉన్న గోపాల్దిన్నె, రామన్పాడు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం కింద ఉన్న పర్దీపూర్ రిజర్వాయర్, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి నాలుగు రోజుల కిందట తూము తెరిచి కాల్వలకు నీటిని వదిలారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో నీటినిల్వ పెరగడంతో లిఫ్ట్ పరిధిలోని ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లలో 2 టీఎంసీలు నిల్వ చేశారు.
కుడి, ఎడమ కాల్వలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్రెడ్డి ఇటీవల నీటిని వదిలారు. ఆర్డీఎస్ వద్ద తూముకు కొత్త షట్లర్లు బిగించారు. మనకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులను సర్కారు ఆదేశించింది. సుంకేసుల బ్యారేజీకి వరద రాక మొదలైంది. తుమ్మిళ్ల, గట్టు లిఫ్ట్లు పూర్తయితే సాగునీటికి ఇక ఢోకా ఉండదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయి. ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతలకు పంపింగ్ ప్రారంభం కాకముందే.. గతేడాది విడుదల చేసిన నీరు.. ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. జూరాల, శ్రీశైలంతోపాటు ఎత్తిపోతల పథకాల పరిధిలోని రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దాదాపు అన్నింటిలో నీరు నిండుగా చేరింది. ఇక రేపో.. మాపో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్కు సాగునీరు విడుదల చేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 400 కేవీ హెవీ లైన్కు ట్రయల్న్ నిర్వహించారు. మోటర్లకు విద్యుత్ కనెక్షన్ ప్రక్రియ పూర్తి చేశారు. నీటిమట్టం పెరగగానే మోటర్లను ఆన్ చేసేందుకు ప్రణాళికలతో అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో దాదాపు 50 వేల ఎకరాలు సాగుకానున్నాయి.
సంబురంగా సాగు
ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండడంతో సాగు సంబురంగా సాగుతున్నది. వానకాలం సీజన్లో వివిధ పంటలను రైతులు వేశారు. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. గొలుసుకట్టు చెరువులను సైతం నింపుతున్నారు. వాగులు, వంకలు పారుతుండడంతో పరీవాహక ప్రాంతాలన్నీ పచ్చదనాన్ని పర్చుకున్నాయి. వర్షాల రాకతోపాటు ప్రాజెక్టులకు వరద వస్తుండడంతో సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. వర్షాధార పంటలతోపాటు కూరగాయలు అధికంగా వేశారు. దీంతో ఈసారి అంచనాకుమించి పంటలు సాగవుతున్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. భూగర్భ జలాలు బాగా పెరగడం కూడా ఇందుకు కార ణం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్లోకి రావడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులతోపా టు 20, 30 ఎకరాలకుపైబడిన కర్షకులు పొలాన్ని సాగు చేస్తున్నారు.
నీటి వృథాకు చెక్..
పాలమూరు జిల్లాలో చెక్డ్యాంలు సత్ఫలితాన్నిస్తున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలోని వాగులపై 29 చెక్డ్యాంలు నిండి అలుగుపారుతున్నాయి. ఇటు దేవరకద్ర నియోజకవర్గంలోనూ బండ్రవల్లి, ఊకచెట్టు, కందూరు వాగులు ఉప్పొంగాయి. దీంతో 20 ఆనకట్టల వద్ద కిలోమీటర్ల చొప్పున నీరు నిలిచి కళకళలాడుతున్నాయి. వాగుల పరీవాహక ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు తీరాయి. సాగు పెద్ద సంఖ్యలో సాగుతున్నది. వాగులు పారుతుండడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్నది. ఇప్పటికే కొన్ని నిండి మత్తడి దుంకుతున్నాయి. దీంతో గతేడాదికన్నా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు వ్యవసాయానికి ఊతమిస్తున్నాయి. నాడు వలస జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు నేడు సాగునీరు, పంటలకు కేరాఫ్గా మారింది.