Paddy Cultivation | హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): వరి పంట సాగు చేయొద్దని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని రైతులు పట్టించుకోవడంలేదు. వరి సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కరువు పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నా, ధాన్యం కొనుగోలు చేయడం కష్టమనే సంకేతాలిస్తున్నా రైతులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. గత సంవత్సరంతో సమానంగా వరి పంటను సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించిన నివేదికలో ఇప్పటికే 30 లక్షల ఎకరాలపైగా వరి నాట్లు వేసినట్టు పేర్కొన్నది. నిరుడు కూడా దాదాపు ఇంతే విస్తీర్ణంలో వరి సాగు నమోదైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వాస్తవానికి, పది రోజుల క్రితం వరకు వరి సాగుపై వర్షాభావ ప్రభావం నెలకొన్నది. అయితే, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో
రైతులు జోరుగా వరి సాగు చేస్తున్నారు.
నిజానికి, కరువు పరిస్థితులతో ఈ సీజన్లో వరి సాగు సగానికి సగం తగ్గిపోతుందని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నిరుడు వానకాలంలో 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ సీజన్లో 38.51 లక్షల ఎకరాలకే పరిమితమవుతుందని భావించారు. ఏకంగా 31.38 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గుతుందని అంచనా వేశారు. కానీ, వ్యవసాయశాఖ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కరువు పరిస్థితుల నుంచి తేరుకొని వర్షాలు కురుస్తుండటంతో వరి సాగు భారీగా పెరుగుతున్నది. ఇప్పటికే వరి నాట్లు 30 లక్షల ఎకరాలు దాటగా, మరో వారంలో మరింత జోరందుకోనున్నాయి.
ధాన్యం ఉత్పత్తి ఎక్కువ అవుతున్నదని, వరి సాగు చేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలనే సాగు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పదే పదే సూచిస్తున్నాయి. కాగా, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేద్దామంటే మార్కెటింగ్, మద్దతు ధర, విత్తనాల రాయితీ వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడంలేదని రైతులు చెప్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే నష్టపోతామేమోనన్న భయంతో వాటి జోలికి వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయ పంటలను ఎక్కువ సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండగా, కొన్ని పంటలు గత సంవత్సరంతో పోల్చితే తగ్గుతుండటం గమనార్హం.
మక్కజొన్న గత సంవత్సరం ఇదే సమయానికి 5.52 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం ఇది 4.95 లక్షలకే పరిమితమైంది. జొన్నలు 32 వేల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 23 వేల ఎకరాల్లోనే సాగయ్యాయి. మొత్తం మిల్లెట్ పంటలు గత సంవత్సరం ఈ సమయానికి 5.86 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 5.21 లక్షల ఎకరాలకే పరిమితం కావడం గమనార్హం. పప్పుధాన్యాల పంటలు గత సంవత్సరం 5.1 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది ప్రస్తుతం 5.48 లక్షల్లో మాత్రమే సాగయ్యాయి. నూనె గింజల పంటలు నిరుడు 3.58 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 3.74 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఇలా ప్రత్యామ్నాయ పంటలు అంతంత మాత్రంగానే సాగు కావడం గమనార్హం.
కరువు పరిస్థితులతో ఈ ఏడాది పంటల సాగు భారీగా తగ్గుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగానే గత సంవత్సరం 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ సీజన్లో 1.07 కోట్ల ఎకరాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. అయితే, వ్యవసాయ శాఖ వెల్లడించిన పంటల సాగు లెక్కల్లో మాత్రం కరువు పరిస్థితులు కనిపించడంలేదు. జోరుగా పంటలు సాగవుతున్నట్టు పేర్కొన్నది. గత సంవత్సరంతో సమానంగా పంటల సాగు అవుతున్నాయని తెలిపింది. నిరుడు ఈ సమయం వరకు అన్ని పంటలు కలిపి 89.94 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 89.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్టు పేర్కొన్నది. అంటే గత సం వత్సరం సాగు అయిన విస్తీర్ణం కంటే 66 వేల ఎకరాలు మాత్రమే తక్కువ. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అంచనాలు తలకిందులవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
