వానకాలం అనారోగ్యాలకు ఆరంభం
తొలకరి చినుకులతో మొదలు
దోమకాటు, నీటి కలుషితంపై అప్రమత్తం
డెంగీ, మలేరియా, అతిసార, టైఫాయిడ్తో ముప్పు
ఇంటింటి సర్వే చేస్తున్న యంత్రాంగం
ర్యాపిడ్ యాక్షన్ బృందాల ఏర్పాటు
పల్లె, పట్టణ ప్రగతితో అపరిశుభ్రతకు చెక్
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వానకాలం రావడంతో వివిధ రకాల వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఆరోగ్య వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. రోగాల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కాగా ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతితో అపరిశుభ్రతకు చెక్ పడింది. ఇదిలా ఉండగా ఇంటింటి సర్వేకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ర్యాపిడ్ యాక్షన్ బృందాలు ముమ్మరంగా పర్యటిస్తూ వ్యాధులను నమోదు చేస్తూ తీవ్రతను బట్టి పీహెచ్సీకి తరలిస్తున్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దోమ కాటు వల్ల వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.
నాగర్కర్నూల్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : సీజనల్ రోగాలపై వైద్యారోగ్య శాఖ సమరం పూ రించనున్నది. వానకాలం ప్రారంభం కావడంతో వివిధ రకాల వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఆరోగ్య వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీజనల్ రోగాల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు. డీఎంహెచ్వోలు, సబ్ సెంటర్ల వైద్యులు, సిబ్బంది.. సీజనల్ రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రతి పల్లె, పట్టణాల్లో ముళ్ల పొదలు, చెత్తాచెదారం తొలగించడంతోపాటు మురుగు గుం తలను పూడ్చారు. ఇండ్ల మధ్య ఉన్న పెంట కుప్పలను సైతం తొలగించారు. ఇక వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ రోగాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పేరిట బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో డీఎంహెచ్వో, మలేరియా అధికారి, హె ల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డివిజన్ స్థాయిలో అదనపు డీఎంహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో, సబ్ యూనిట్ అధికారి, హెల్త్ అసిస్టెంట్లు, పీహెచ్సీ పరిధిలో మండల వై ద్యాధికారి, కమ్యూనిటీ హెల్త్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, ఆశలు, పంచాయతీకార్యదర్శి, హెల్త్ సూపర్వైజర్, పురపాలికల్లో శానిటైజేషన్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు.
ఎవరైనా జ్వరం, ఇతర అనారోగ్యాల బారిన పడితే సమీప పీహెచ్సీకి పంపిస్తున్నారు. డెంగీ లక్షణాలుంటే ఉ న్నతాధికారులకు నివేదిస్తారు. సమీప 50 నివాసా ల పరిధిలో ఫాగింగ్ చేపడతారు. ఇప్పటికే వైద్యశాఖ డ్రైడేను ప్రారంభించింది. ప్రతి శుక్రవారం గ్రామా ల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేయనున్నారు. దోమకాటు వల్ల వ్యాపించే వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఐసీడీఎస్, మిషన్ భగీరథ ఈఈ, డీపీవో, డీఆర్డీఏ పీవో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఐటీడీఏ పీవో, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. పంచాయతీ, పురపాలికల శాఖలు చెత్తాచెదారం, కాల్వల్లో ము రుగు, టెమిఫాస్ పిచికారీ చేయడం, మిషన్ భగీరథ నీళ్లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోనున్నాయి. ఇలా సీజనల్ రోగాలపై వైద్యారోగ్య శాఖతోపాటు రెవెన్యూ, పంచాయతీ, పురపాలికలు ముందస్తు చర్యలకు సన్నద్ధమయ్యాయి.
ఇవీ ముందస్తు జాగ్రత్తలు..
దోమ సంక్రమిత వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ప్రజలు తమ ఇండ్లల్లో ఖాళీ కుండలు, సా మగ్రిని మూసి ఉంచాలి. కూలర్లు, టైర్లు, ఇతర పా త్రల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇండ్లల్లోని చెత్తను, కొబ్బరి బొండాలను, ఖాళీ డబ్బాలు, చెత్త సామగ్రిని పారవేయాలి. ఇండ్ల మధ్య గుంతలు లేకుండా, మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవా లి. పెద్ద గుంతల్లో ఆయిల్ బాల్స్ వేసుకోవాలి. నిల్వ ఉన్న నీటిలో పది లీటర్లకు 5 ఎంఎల్ కలిపి సిద్ధం చేసిన టెమిఫాస్ ద్రావణాన్ని ఆశలు పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దోమ గుడ్డును లార్వా దశలోనే చంపేస్తుంది. ఇండ్లల్లో బిందెకు నాలుగైదు చుక్కలు వేసుకుంటే చాలు. సాయంత్రం ఇండ్ల త లుపులు మూసుకోవాలి. కిటికీలకు పరదాలు కట్టుకోవాలి. తాగునీటిని క్లోరినేషన్ చేయించాలి. నీళ్లు కాచి వడకట్టి తాగితే చాలా మంచిది. కలుషిత నీటి ద్వారా టైఫాయిడ్, పసిరికలు, వాంతులు, వీరేచనాలు, నట్టల వంటి రోగాలు వస్తాయి. కూరగాయ లు, మాంసం శుభ్రంగా కడగాలి. పూర్తిగా ఉడికించుకొని వేడివేడిగా భుజించాలి.
ప్రజల అప్రమత్తతే ముఖ్యం..
సీజనల్ వ్యాధులు రాకుండా వైద్యారోగ్య శాఖ ద్వారా ఇంటింటి సర్వే, కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నాం. దోమలు నిల్వ ఉండకుండా ఆయిల్ బాల్స్ చల్లుతున్నాం. ప్రతి శుక్రవారం చేపడుతున్న డ్రై డే ద్వారా దోమ సంక్రమిత, నీటి కలుషిత వ్యాధుల నివారణకు తీసుకునే చర్యలను వివరిస్తున్నాం. ఇండ్ల మధ్య మురుగు, చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డెంగీ, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానలో చూపించుకోవాలి. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. గతేడాది 114 డెంగీ కేసులు వచ్చాయి. జూలై, ఆగస్టులో డెంగీ ముప్పు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. పల్లె, పట్టణ ప్రగతితో పరిసరాల పారిశుధ్యం చాలా మెరుగుపడింది. ప్రజలు సొంతంగా పరిశుభ్రతా చర్యలు పాటిస్తే సీజనల్ రోగాలు దరి చేరవు. జిల్లాలో 26 పీహెచ్సీలు, 4 కమ్యూనిటీ దవాఖానలు, 178 సబ్ సెంటర్లు పరిధిలో సీజనల్ వ్యాధులపై సిబ్బందిని అప్రమత్తం చేశాం.
– సుధాకర్ లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్