కల్వకుర్తి, నవంబర్ 19: కల్వకుర్తిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. సభా ప్రాంగణంతోపాటు కల్వకుర్తి పట్టణం గులాబీమయంగా మారింది. సభ విజయవంతం కావడంతో గులాబీశ్రేణుల్లో జోష్ నిండింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 5 గంటల తర్వాత కల్వకుర్తి సభకు వచ్చారు. అప్పటి వరకు సభకు వచ్చిన ప్రజలు ఓపికగా కూర్చున్నారు. ముఖ్యమంత్రి వచ్చే వరకు సభకు హాజరైన వారిని మిట్టపల్లి సురేందర్ ఆధ్వర్యంలో కళాబృందం తమ పాటలతో ఉర్రుతలూగించారు. గులాబీ కండువాలు ఉపుతూ ఉత్సాహాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి హెలీకాప్టర్ రాగానే సభకు హాజరైన జనాలు పైకిలేచి కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి సభకు హాజరుకావడంతో రెట్టించిన ఉత్సాహం తో గులాబీశ్రేణులు, ప్రజలు కేసీఆర్, కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ను పత్యక్షంగా చూడడంతోపాటు ఆయన ప్రసంగాన్ని నేరుగా వింటున్న ఆనందరం సభికుల్లో స్పష్టంగా కనబడింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు సభకు హాజరైన ప్రజలు నిశ్శబ్ధంగా కూర్చున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ధరణి కావాలా.. వద్దా అంటూ ముఖ్యమంత్రి అడగడంతో ప్రజలు పెద్ద ఎత్తున్న కావాలి.. కావాలి అంటూ నినాదాలు చేశారు.
ధరణి కావాలంటే ఎవరికి ఓటు వేయాలని ముఖ్యమంత్రి అడగ్గా.. బీఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున్న స్పందించారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై పలు కోర్కెలు కోరారు. జైపాల్యాదవ్ను గెలిపిస్తే.. ఆయన కోరిన విధంగా కల్వకుర్తిలో ఇంజినీరింగ్ కళాశాల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలో 1.50లక్షల ఎకరాలకు సాగునీరు, ఆమగనల్లులో ఆర్డీవో, ఎంవీఐ, ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త మండలాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో సభికులు చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తిరిగి హెలీకాప్టర్ వద్దకు వెళ్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున్న బారీకేట్లను తొలగించి ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంట హెలీపాడ్ వద్దకు పరుగుల తీశారు. హెలీకాప్టర్ పైకి లేవగానే ముఖ్యమంత్రికి చేతులు ఊపుతూ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. సభకు పెద్దఎత్తున్న జనం హాజరుకావడం, సభ సక్సెస్ కావడంతో గులాబీశ్రేణుల్లో జోష్ నెలకొంది. సభ విజయవతం కావడంతో ఎమ్మెల్యే జైపాల్యాదవ్తోపాటు బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సభ సందర్భంగా కల్వకుర్తిలో ప్రధాన రోడ్లు, కూడళ్లలో ఫ్లెక్సీలతోపాటు జెండాలను ఏర్పాటు చేశారు. కల్వకుర్తి పట్టణం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం ముఖ్యమంత్రి వచ్చేవరకు సందడిగా మారిపోయింది.
కడ్తాల్, నవంబర్19: కల్వకుర్తి పట్టణంలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలో సాంస్కృతిక కార్యక్రమాలు జోష్ నందించాయి. కళాకారులు మిట్టపల్లి సురేందర్, సంధ్య, చిత్తరంజన్దాస్ బృందంతోపాటు గులాబీల జెండలే ఫేమ్ లక్ష్మమ్మ, సుశీల బృందం పాడిన పాటలు సభకు హాజరైన నాయకులు, కార్యకర్తలను, పార్టీ అభిమానులను ఉర్రూతలూగించాయి. రామక్క పాటకు సభలో జనాలు ఈలలు వేస్తూ గులాబీ కండువాలను ఊపుతూ డ్యాన్స్లు చేశారు. సభలో సాయిచంద్ను స్మరించుకుంటూ ఆలపించిన పాట విశేషంగా ఆకట్టుకున్నది. సభలో పలువురు మహిళలు బోనాలతో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.