న్యూఢిల్లీ : ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనలు, నినాదాల మధ్య సోమవారం లోక్సభ స్తంభించింది. పబ్లిక్, పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై చర్చ జరగకుండానే సభ రోజంతా వాయిదా పడుతూ వచ్చింది. విద్యార్థులపై పోలీసులు చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం నుంచి స్పందన కోరుతూ, విపక్షాలు నిరసనలను కొనసాగించాయి. సాయంత్రం 5 గంటలకు తిరిగి సమావేశమైనప్పటికీ, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) సవరణ బిల్లు-2026పై చర్చ జరుగలేదు. విపక్షాల నిరసనల హోరు మధ్య స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
విద్యార్థులపై పోలీసులు చేపట్టిన చర్యపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ రాజ్యసభలో సోమవారం విపక్షాలు పట్టుపట్టడంతో కార్యకలాపాలు ఉదయం నుంచి నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. సాయంత్రం 5:15 గంటలకు ఎగువసభ సమావేశం కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, సవరణ బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ను కోరామని చెప్పారు. అయితే ఈ చర్చకు ముందే హోం మంత్రి వచ్చి ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో మంగళవారం నాటికి వాయిదా పడింది.
విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ సోమవారం పార్లమెంట్ భవన సముదాయంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తదితరులు పాల్గొన్నారు. డీఎంకే ఎంపీలు వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.