పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది బాలీవుడ్ కథానాయిక భూమి ఫడ్నేకర్. తాజాగా ఈ భామ చారిత్రక యోధురాలు బెలవాడి మల్లమ్మ పాత్రలో కనిపించనుంది. రిషబ్శెట్టి కథానాయకుడిగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సందీప్ సింగ్ దర్శకుడు. ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్ బెలవాడి సంస్థానాన్ని ఏలిన రాణి మల్లమ్మ పాత్రలో కనిపించనుందని మేకర్స్ తెలిపారు. భారతదేశ చరిత్రలో మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలిరాణిగా ఆమె ప్రసిద్ధికెక్కారు. ఛత్రపతి శివాజీ, మల్లమ్మ మధ్య యుద్ధం జరిగిందని, ఇందులో శివాజీని మల్లమ్మ ఓడించిందనే వాదనలు కూడా ఉన్నాయి.
1678 బెలవాడి యుద్ధంలో తన భర్త ఈశ్వరప్రభు దేశాయ్ మరణించినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా శివాజీ సేనలతో 27 రోజుల పాటు వీరోచిత పోరాటం చేసి బెలవాడి కోటను కాపాడుకున్న ధీరవనితగా ఆమెను చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. శివాజీ మహారాజ్, బెలవాడి మల్లమ్మ మధ్య జరిగిన పోరును ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని, సినిమాలో అది ప్రధానఘట్టంగా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది.