నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 24 : వాతావరణంలో మార్పులో భాగంగా మంగళవారం మధ్య రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా దవాఖానకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మం గళవారం అప్పక్పల్లి వద్దనున్న జిల్లా దవాఖానలో మొత్తం అంధకారం నెలకొనడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి 10:30 గంటల నుంచి మంగళవారం మధ్యా హ్నం 3 గంటల వరకు దవాఖానలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మొబైల్ ఫోన్ల వెలుతురులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సదరం క్యాంప్ ఉండడంతో కరెంట్ లేకపోవడం దివ్యాంగులు గంటలకు క్యూలైన్లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దవాఖానలో కనీసం జనరేటర్ సౌకర్యం లేకపోవడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే దవాఖానలోని రోగులు, వివిధ వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు వచ్చిన ఔట్ పేషెంట్లు దాదాపు 12 గంటలపాటు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి జిల్లా దవాఖానలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.