మద్దూర్ జనవరి 30: కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దూరులో నామినేషన్ల సందర్భంగా రామాలయం చౌరస్తా నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పట్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దూరులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, దీనికి ర్యాలీకి వచ్చిన జనమే సాక్ష్యం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అంతేకాకుండా ఈ నియోకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి అటు రాష్ట్రాన్ని, ఇటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపై ప్రజలు ఎంతో గుర్రు గా ఉన్నారని, అందుకే మున్సిపల్ ఎన్నికల నుంచే ప్రజలు ఆయనను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. మద్దూరుతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో మద్దూరు మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.