ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వరాలజల్లు కురిసింది. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మహబూబ్నగర్కు మరో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో వ్యవసాయ ఆధారితఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించారు. కేంద్రం, విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల 60 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్గా మార్చడంతో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కాగా, బడ్జెట్లో పాలమూరుకు సముచిత స్థానం దక్కిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సాగునీటి రంగాన్ని ప్రోత్సహిస్తుందనేందుకు ఈ పద్దు నిదర్శనమని ప్రజలు, నాయకులు పేర్కొంటున్నారు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఉమ్మడిజిల్లాకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ వరాలజల్లు కురిపించారు. జేఎన్టీయూ పరిధిలో మహబూబ్నగర్లో మరో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేశారు. వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. పాలమూరు యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నిధులు కేటాయించారు. కేంద్రం, విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 60శాతం పూర్తయిందని, త్వరలో ఆయకట్టును మరింత పెంచుతామన్నారు. కృష్ణాజలాల్లో వాటాలు తేల్చకున్నా.. విపక్షాలు కేసులు వేసి అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నారాయణపేట, గద్వాలలో చేనేతరంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని వివరించారు. మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో పాలమూరుకు అనేక వరాలు కురిపించారని, సముచితస్థానం దక్కిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాగునీటిరంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి బడ్జెట్ నిదర్శనమని సామాన్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక మంత్రి నోట నారాయణపేట చేనేత ప్రస్తావన
నారాయణపేట, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో చేనేతరంగానికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతాల్లో నారాయణపేట ఒకటని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నారాయణపేట చేనేత ప్రస్తావన తీసుకొచ్చారు. అలాంటి చేనేత రంగాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయన్నారు. 75సంవత్సరాల స్వాతంత్య్ర భారతావనిలో మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేనేతరంగంపై జీఎస్టీ విధించడం వల్ల ముడిసరుకు పెట్టుబడులు పెరగడంతో చేనేతరంగం నష్టాల్లోకి చేరి చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున అనేక చర్యలు తీసుకోవడంతోపాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలను అరికట్టడానికి చేనేత బీమా పథకాన్ని తీసుకొచ్చి ధీమా కల్పించిందన్నారు.
‘పాలమూరు-రంగారెడ్డి’కి మహర్దశ
రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి పాలమూరుజిల్లా వరప్రదాయిని అయిన ప్రాజెక్టు నిర్మాణం 60శాతం పూర్తయింది. కేసులు, కృష్ణాజలాల వాటా తేల్చనందుకు ఆలస్యమవుతుందని ఎండగట్టింది. ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్జీటీలో కేసులు వేసి అడ్డకుంటున్నా పనులు నడుస్తున్నాయి. కేంద్రం కృష్ణాజలాల వాటా తేల్చనందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆర్థికశాఖ మంత్రి ఆక్షేపించారు. వాటా తేలిస్తే వెంటనే ప్రాజెక్టు పూర్తయి మరింత ఆయకట్టుకు సాగునీరు అందేదని అసెంబ్లీలో ప్రస్తావించారు. అయినా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలు పూర్తిచేసి 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, వలసలు వాపస్వచ్చేలా చేశామని ఘంటాపథంగా చెప్పారు. డిండి ఎత్తిపోతల పథకం కూడా పెండింగ్లో పడటానికి ఇదే కారణమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
నియోజకవర్గానికి రెండువేల ఇండ్లు..
డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు పథకం మరింతమందికి లబ్ధి చేకూర్చేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల స్థానంలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. గృహనిర్మాణ శాఖను ఆర్అండ్బీ డిపార్ట్మెంట్లో విలీనం చేసి అక్కడి నుంచి బిల్లులు చెల్లించాలని ప్రతిపాదించారు. ప్లాట్లు ఉండి, ఇండ్లులేని లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇందుకుగానూ నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుంది. గతంలో నియోజకవర్గానికి 100కేటాయించిన సర్కార్ ఈ ఏడాది ఏకంగా 1100మందికి దళితబంధు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ మేరకు నిధులు కేటాయించారు.
నగదు రహితం హర్షణీయం
ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న 1శాతం చందాతో కూడిన నగదురహిత వైద్యసహాయానికి రూ.6.50లక్షల భద్రత కల్పిస్తూ అసెంబ్లీలో ఏటా రూ.700కోట్ల బడ్జెట్ను ఈహెచ్ఎస్ అమలుకు నిధులు కేటాయించడం హర్షణీయం. ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయడంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, సంఘం నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– రాజీవ్రెడ్డి, టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు, మహబూబ్నగర్
వ్యవసాయానికి అగ్రతాంబూలం
అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు 2023-24సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ, అనుబంధరంగాలకు అగ్రతాంబులం అందించారు. బడ్జెట్ మొత్తం 2,90,396కోట్లు కాగా, వ్యవసాయ అనుబంధరంగాలకు రూ.77,865కోట్లు కేటాయించడం హర్షణీయం. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనడానికి ఇంతకన్న ఉదాహరణ మరొకటి ఉండదు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– హనుమాన్రావు, మదనాపురం
సామాన్యుడికి చేరువలో..
అంకెల మంత్రాలు కాకుండా సామాన్యుడి జీవితానికి చేరువలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం బాగుంది. రైతులకు, కార్మికులకు, కర్షకులకు, విద్య, వైద్యం ఇలా అన్నిరంగాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షణీయం. ప్రత్యేకంగా మున్సిపాలిటిలలో రూ.11వేల కోట్లు అభివృద్ధికి కేటాయించడం బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది.
– గట్టుయాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
ప్రజా ఆమోద బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా ఆమోదయోగ్యమైనది. ప్రజారోగ్యం, విద్యావ్యవస్థకు అత్యధిక నిధులు కేటాయించి దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. రైతులకు రూ.30వేల నుంచి రూ.లక్షలోపు రుణమాఫీ చేయడానికి తీసుకున్న నిర్ణయం రైతాంగం కండ్లల్లో సంతోషం చూడటమే. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కృషి అభినందనీయం.
– వాకిటి శ్రీధర్, మున్సిపల్ వైస్చైర్మన్, వనపర్తి
పట్టణాభివృద్ధికి నిధులు హర్షణీయం
మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం. ఇంత గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ఆలకు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర బడ్జెట్ను ప్రజలు ఆహ్వానిస్తున్నారు. దేశంలోనే తెలంగాణ బడ్జెట్ ఆదర్శం.
– సురేశ్గౌడ్, భూత్పూర్ మున్సిపాలిటీ