బాలానగర్ ( మహబూబ్నగర్ ) : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్షాలు జిమ్మిక్కులను ప్రారంభించాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు. ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ డిక్లరేషన్ల (Declarations ) పేరిట ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఆరోపించారు. మహబూబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలంగాణలో వచ్చి డిక్లరేషన్ల పేరిట లొల్లి చేస్తున్నారని ఆరోపించారు. డిక్లరేషన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడదం లేదని ప్రశ్నించారు. గత 70 ఏళ్లుగా అధికారంలో ఉండి ఇక్కడి ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయని పార్టీలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వచ్చి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు వచ్చే టూరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.
అత్యధిక గిరిజన (Tribals ) జనాభా ఉండే ఈ ప్రాంతంలో కనీసం సేవాలాల్ గుడి కట్టాలని, గిరిజన భవన్ కట్టాలనే ఆలోచన కూడా గత పాలకులు చేయలేదని అన్నారు. గిరిజనులను కేవలం ఓటు బ్యాంకు ( Vote Bank ) గా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో తండాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారని తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ (CM KCR) దేనని పేర్కొన్నారు.
హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో గిరిజన భవనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రైతులంతా కలశాలతో ప్రాజెక్టు వద్దకు తరలిరావాలని కృష్ణానీటిని తీసుకుపోయి గ్రామాల్లో చల్లాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.