హన్వాడ, ఏప్రిల్ 21 : ఆరు గ్యారెంటీలతోపాటు అనేక అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. అందుకే ప్రజలు మరోసారి కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోవద్దని సూచించారు. ఆదివారం మండంలోని నాయినోనిపల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎండిన పంటలను పరిశీలించి ఎకరాకు రూ.25వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ పాతరోజులొచ్చాయని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటినా నేటికీ ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు.
కేసీఆర్ పాలనలో రైతులకు రైతుబీమా, రైతుబంధు, 24గంటల కరెంటు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు అం డగా నిలిచాయని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేసిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4వేలు చేస్తామని, రైతుబంధు పెంచుతామని, రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని, వడ్లకు బోనస్ రూ.500 చెల్లిస్తామని, కల్యాణలక్ష్మికి నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని మాయ మాటలు చెప్పిన రేవంత్రెడ్డి నేడు సీఎం అయిన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అందుకే రైతుల పక్షాన ఉన్న బీఆర్ఎస్కు అండగా ఉండాలని, మీకు అండగా ఉండి మీ తరఫున పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం తిరుమలగిరిలో రైతులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ఆరా తీశారు. రైతుల పక్షాన ఉండే బీఆర్ఎస్కు ప్రజలు అండగా ఉండాలని, ఎంపీగా మన్నె శ్రీనివాస్రెడ్డిని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, ప్రధాన కార్యదర్శి శివకుమార్, సింగిల్ విండో చైర్మన్, వైస్చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీ వడ్ల శేఖర్, నాయకులు కొండ లక్ష్మయ్య, కొండ బాలయ్య, నరేందర్, చెన్నయ్య, ఆశన్నతోపాటు పలు వురు రైతులు పాల్గొన్నారు.