కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఒమిక్రాన్ బీఎఫ్-7 రూపంలో మరో ఉపద్రవం పొంచి ఉన్నది. చైనా సహా విదేశాల్లో ఈ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఇప్పటికే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు లేకున్నా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలు జారీ చేయడంతో అధికారగణం ముందస్తు చర్యలు చేపట్టింది. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచింది. పండుగలు, పార్టీల సమయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నది. జనాల్లోకి వెళ్తే భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించాలని సూచించింది. శానిటైజేషన్తోపాటు టీకా, బూస్టర్డోస్ వేసుకోవాలని, ఇదే శ్రీరామరక్ష అని చెబుతున్నది.
– నాగర్కర్నూల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : చైనా, జపాన్, అమెరికాతో సహా విదేశాల్లో కరోనా మహమ్మారి భయానక పరిస్థితులను కలిగిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నది. ఇప్పటివరకు కేసులు నమోదు కాకున్నా.. అప్రమత్తంగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నది. 2020, 2021లో వరుసగా వేలాది మంది కరోనాకు బలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు, బూస్టర్ డోస్లు ఇవ్వడం, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం, కరోనా నిబంధనలు పాటించడంతో ఈ ఏడాది అంతగా ప్రభావం చూపలేదు.
కాగా, తిరిగి విదేశాల్లో బీఎఫ్-7 రకం కరోనా వేరియంట్ ఆందోళన కలిగిస్తున్నది. దీంతో రాష్ట్రంలోనూ ముందస్తు జాగ్రత్త చర్యల్లో వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఎలాంటి ముప్పు లేకున్నా.. దవాఖానల్లో ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాక్సిన్లు తీసుకోని వారు కచ్చితంగా టీకా తీసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది. బూస్టర్ డోస్ను కూడా తీసుకోవాల్సిందిగా వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకలు, పండుగలు, శుభకార్యాలు జరుగుతుండడంతో నిబంధనలు పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించాలి. భౌతికదూరం పాటిస్తూనే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శానిటైజేషన్ చేసుకోవాలి. ప్రస్తుతం జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కావడం లేదు. వ్యాక్సినేషన్, అవగాహనతో ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగింది.
కరోనా సాధారణ జలుబులా మారింది. దీంతో కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించకున్నా వైద్యులు మాత్రం వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లడం తగ్గించుకోవాలి. జ్వరం, గొంతునొప్పి, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యం తీసుకోవాలి. విదేశీ ప్రయాణాలు మానుకోవాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
కరోనాపై ప్రజలు ఆందోళన చెందొద్దు. కానీ అప్రమత్తంగా ఉండాలి. గతంలో మాదిరిగా మాస్క్, శానిటైజేషన్, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించాలి. పండుగలు, శుభకార్యాలంటూ బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకోవాలి. ఇటీవలే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వెంటిలెటర్లతో కూడిన 110 ఐసీయూ బెడ్లు ఉండగా, 300 వరకు ఆక్సిజన్ సదుపాయం ఉన్న బెడ్లు గతంలో ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తీసుకునే చర్యలకంటే ప్రజల అప్రమత్తతోనే కరోనా ముప్పు తప్పించుకోవచ్చు. – సుధాకర్లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్