ఆయిల్పాం సాగు వేగంగా విస్తరిస్తున్నది. ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో రైతన్నలు మొగ్గు చూపుతున్నారు. మన నేలలు తోటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో నారాయణపేట జిల్లాలో 4,475 ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి. నాలుగేండ్ల తర్వాత ఎకరాకూ రూ.లక్ష చొప్పున రాబడి వస్తున్నది. వాణిజ్య పంట సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో జిల్లాలో 90 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మలేషియా, ఇండోనేషియా దేశాలు ఆయిల్పాం తోటలతో ఆర్థికంగా వృద్ధి చెందగా.. తెలంగాణ ప్రభుత్వమూ రైతులను ప్రోత్సహిస్తున్నది.
– మక్తల్ అర్బన్, జూలై 7
మక్తల్ అర్బన్, జూలై 7 : ఆయిల్పాం మొక్కలు ఈత, కొబ్బరి చెట్లను పోలి ఉంటాయి. ఇది పామే కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో దేశీ రకం చెట్టు 15 మీటర్ల ఎత్తు, సంకరజాతి (హైబ్రిడ్) చెట్టు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. నీటి సదుపా యం కలిగిన గరప, ఎర్రమట్టి, నల్లరేగడి భూము లు ఈ తోటల సాగుకు అనుకూలం.
రాష్ట్రంలోని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వరి, కంది, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆయిల్ పాం సాగుతో మలేషియా, ఇండోనేషియా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందా యి. ఈక్రమంలో తెలంగాణ రైతులు కూడా రాణించాలని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యం లో ప్రోత్సాహకంగా ఎకరాకు రూ.2,100 చొప్పున నాలుగేండ్లకు ఎకరాకు రూ.8,400, అంతర పం టల సాగుకు ఎకరాకు రూ.2,100 చొప్పున నాలుగేండ్లకు రూ.8,400 రాయితీ ఇసున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ప్రభుత్వరంగ సంస్థ, ఇతర ప్రైవేట్ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పాంను సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ పరిధిలో ఎనిమిది జిల్లాలో (ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, జోగుళాంబ, గద్వాల, నారాయణపేట) 20వేల మంది రైతులతో లక్షా 120 ఎకరాల్లో ఆయిల్ పాం తోటలు సాగు చేస్తున్నారు.
ఆయిల్ పాం ఉపయోగాలు
ఆయిల్ పాం మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30 ఏండ్ల పాటు నిరంతరం ఆదాయం పొందవచ్చు. మొదటి మూడేండ్ల పాటు అంతర పంటలు ( కూరగాయలు, వేరుశనగ, అరటి, పొప్పిడి వంటి పంటలు) సాగు చేసుకోవచ్చు. ఈ తోటకు తెగుళ్లు, చీడ పురుగుల బెడద చాలా తక్కువ. తుఫాన్, వడగండ్ల వాన, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా అడవి పందులు, దొంగల బెడద ఉండదు. మొక్క నాటిన ఆరునెలల పాటు జింకల నుంచి రక్షించుకోవాలి. ఎకరాకు 10టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర రూ.13,960. ఏడాది వయస్సు ఉన్న మొక్కను అధికారులు రైతులకు అందిస్తారు. ఈ మొక్కకు 12 ఆకులు ఉండేట్లు చూసుకొని నాటుకోవాలి.
జిల్లాలో తోటల విస్తీర్ణం
నారాయణపేట జిల్లాలో ఆయిల్ పాం సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. మొక్కలను ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ అధికారులు ఆయిల్ ఫెడ్ సంస్థ నుంచి రైతులకు అందిస్తారు. ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారులు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో తోటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నారాయపేట జిల్లాలో 2019 నుంచి 2023 వరకు 4,475 ఎకరాల్లో ఆయిల్ పాంను సాగు చేస్తున్నారు. 2022-23 సంత్సరానికిగానూ 4,047 ఎకరాలు వేయాల్సి ఉండగా 3వేల ఎకరాలు సాగు చేశారు. 2023 -2024 సంవత్సరానికి గానూ జిల్లాలో 6,200 ఎకరాల్లో సాగుచేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మక్తల్ నుంచి సుమారు 50మంది రైతులను ఉద్యానశాఖ అధికారులు ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేటకు ఆయిల్ పాం తోటలపై అవగాహన కల్పించేందుకు తీసుకెళ్లారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల్లో ఆయిల్ పాంను అత్యధికంగా సాగు చేస్తున్నారు.
ప్రభుత్వం రాయితీ
ఆయిల్ పాం మొక్క ధర రూ.193 కాగా ప్రభుత్వం రైతుకు కేవలం రూ.20కు అందజేస్తున్నది. ప్రతి రైతుకూ మొక్కకు రూ.20 చొప్పున ఎకరాకు 57 మొక్కలకు రూ.1,140 సబ్సిడీ ఇస్తుంది. ఈ అమౌంట్ను ఆయిల్ ఫెడ్ సంస్థకు డీడీ రూపంలో చెల్లించాలి. మొక్కలతోపాటు డ్రిప్కు కూడా షెడ్యూల్డ్ కులాల రైతులకు ప్రభుత్వం 100శాతం రాయితీ కల్పిస్తున్నది. చిన్న, సన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 80శాతం రాయితీ కల్పిస్తున్నది. ఆయిల్ పాం తోటల నిర్వహణకు నాలుగేండ్ల వరకు ఎకరాకు రూ.8,400 చొప్పున రాయితీ ఇస్తోంది.
రైతుల ఆదాయం పెంచేందుకే..
ఆయిల్ను మనం ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణలోని రైతుల ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాణిజ్య పంటలో భాగంగా ఆయిల్ పాం సాగు చేసే రైతులకు రాయితీ కల్పిస్తున్నారు. జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈక్రమంలో పంటను అమ్ముకునేందుకు వీలుగా మక్తల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం సహకారంతో మాగనూర్ మండలంలో 90 ఎకరాల స్థలంలో ఆయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్ను ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు. కన్మనూర్లో ఇప్పటికే లక్షా 20వేల ఆయిల్ పాం మొక్కలను సిద్ధంగా ఉంచాం. ఉద్యానవన శాఖ అదికారులు నిరంతరం తోటలను పర్యవేక్షిస్తూ రైతులకు భరోసానిస్తారు. దీంతో నాలుగేండ్లకు రావాల్సిన దిగుబడి మూడున్నరేండ్లకే దిగుబడి వస్తోంది. రైతుల వద్దకు ఆయిల్ ఫెడ్ సంస్థ వచ్చి పంటను కొంటుంది. జిల్లాలో ఆయిల్ పాం సాగుకు రైతులు ముందుకు రావాలి.
– వీవీఎస్ సాయిబాబా, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి
ఎమ్మెల్యే చిట్టెం స్ఫూర్తితో..
మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తన పొలంలో పదెకరాల్లో ఆయిల్ పాం సాగు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యేను స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా మక్తల్, నర్వ మండలాల్లో సాగవుతున్నది. రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనిస్తున్నది. కొత్తగా తోట సాగు చేయాలనుకునే రైతులు నేరుగా నన్ను.. లేదా ఏఈవోలను సంప్రదించవచ్చు. నాలుగేండ్ల నుంచి ఎకరాకు రూ.లక్ష ఆదాయాన్ని రైతు పొందుతారు.
– సమీనా బేగం, నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారి
90శాతం సబ్సిడీ ఇచ్చారు..
ఉద్యానశాఖ అధికారుల సహకారంతో ఐదెకరాల్లో మొక్కలు నాటాను. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ కూడా పెట్టారు. పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో ఈసారి ఆయిల్ పాం సాగు చేయాలని నిర్ణయించుకున్నా. ఐదెకరాల్లో 270 మొక్కలను నాటాము.
– వడ్ల వెంకటేశ్, సీపూర్, నర్వ మండలం