అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.. కొన్ని రోజులుగా మోతమోగిన మైకులు మూగబోయాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. కాగా, గురువారం పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల అధికారులు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పరిసమాప్తం కావడంతో కీలక ఘట్టానికి తెరలేచింది. గురువారం పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు మంగళవారం సాయం త్రం 5గంటలకు ప్రచారాన్ని ముగించడంతో మైకులన్నీ మూగబోయాయి. 15 రోజులుగా పట్టణాలు, గ్రామాలన్న తేడాలేకుండా ఉదయం నుంచి రాత్రి 10గంట ల వరకు మైకులు డీజే సాంగ్లతో హోరెత్తించారు. చివరిరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా పార్టీలు రోడ్ షోలతో అదరగొట్టేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పక్షం రోజులుగా ప్రయత్నించిన రాజకీయ పార్టీలు ఇక ప్రలోభాలకు తెరలేపాయి. ఎన్నికల ఘట్టం ప్రారంభం కాగానే కాంగ్రె స్ పార్టీ కుతంత్రాలకు తెరలేపింది. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను, ఇతర ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసేందుకు భారీ ఆఫర్లు ఇచ్చినా పార్టీలు మారకపోవడంతో కంగుతిన్న హస్తం పార్టీ నేతలు ఇక డైరెక్ట్గా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధమ వుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో భారీఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల వద్ద కోట్లాది రూపాయల నగదు, భారీ మద్యం పట్టుబడ్డాయి.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వీటిని తరలి స్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతా వరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. పోలీసు భద్రత మధ్య పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఓటింగ్ సరళిని మొత్తం సీసీ కెమెరాలో రికార్డు చేయనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్తగా హోం ఓటింగ్ను అధికారులు నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ చెక్పోస్ట్లు పెట్టి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మద్యం భారీగా ఓటర్లకు ఆఫర్ చేస్తుండడంతో ఎన్నికల పరిశీలకులు ఆయా మద్యం దుకాణాలను ఇది వరకే తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. నారాయణపేట జిల్లాలో కాం గ్రెస్ నాయకులు మద్యం కోసం చిట్టీలు రాసి ఇస్తున్నారనే ఆరోపణలతో రెండు వైన్ షాపులను సీజ్ చేశారు. పోలింగ్కు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో ఓటమిని అంగీకరించలేని కాంగ్రెస్ నాయకులు దా డులకు తెగబడ్డారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. కొడంగల్, కోస్గి, మద్దూరు మండలాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గాయపరిచారు. అనేక చోట్ల బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూడలేక అనేక చోట్ల ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ సభల్లో ప్రజలు మీరేం చేశారని నిలదీసినా అవన్నీ బీఆర్ఎస్ ప్రయత్నమేనని ప్రత్యరోపణలకు దిగారు.
మహబూబ్గర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలో ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న పోలింగ్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కలెక్టర్లతో కలిసి అన్ని ఏర్పా ట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో వచ్చిన ఫిర్యాదులను బట్టి ఓటర్లకు అవసరమైన చోట పోలింగ్ కేంద్రాల ను సిద్ధం చేశారు. ఈవీఎంలను ముందస్తుగా తనిఖీలు నిర్వహించి వాటిని భారీ భద్రత మధ్య నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. బుధవారం వీటిని భారీ బందోబస్తు మధ్య ఆయా పోలింగ్ కే్ంర దాలకు తరలిస్తారు. ఇప్పటికే ఓటింగ్కు అవసరమైన ఓటర్ స్లిప్పులను అందజేశారు. తుది ఓటరు జాబితాను ప్రకటించి ఆయా కేంద్రాలకు పంపించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన టెంట్లు, తాగునీరు, వైద్యంతోపాటు అన్ని సౌకర్యాలను కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు అవసరమైన వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరీశీలకులతోపాటు కలెక్టర్లు పూర్తిస్థాయిలో పరిశీలించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో పోలీస్ బలగాల తోపాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్ర బలగాలను రంగంలో దింపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులను కూడా బందోబస్తులో వినియోగించుకుంటున్నారు. గత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాలను ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓటర్లు ఓటు వేసేందుకు భారీ భద్ర త చర్యలు చేపట్టారు. ఇదే కాకుండా స్ట్రైకిం గ్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా వెంటనే చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలీస్స్టేషన్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే 144 సెక్షన్ను అమలు చేస్తామని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే నిలిపి పార్టీ కండువాలు లేకుండా, ప్రచారం చేయకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్కు సర్వంసిద్ధం కావడంతో మిగిలిన 48గంటల సమయం మాత్రమే మిగలడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు మునిగిపోయారు.