అచ్చంపేట రూరల్, జూలై 6 : చిన్న వయస్సులోనే కన్న వారిని కోల్పో యి అనాథలుగా మారిన చిన్నారులు, ఇతర కారణాలతో నిరాశ్రయులైన బాలబాలికలకు భరోసా దక్కనున్నది. ఆర్థిక కష్టాలతో విద్య, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మిషన్ వాత్సల్య పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో బాలల సంరక్షణ పథకంతో కొంత మంది పిల్లలకు మాత్రమే ఆర్థిక సహాయం అందేది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం హయాంలో స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకు అర్హులైన వారందరికీ ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఈ పథకంలో లబ్ధిపొందేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఐసీడీఎస్ అధికారులు క్లస్టర్ల వారీగా గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. వివరాలను ఎప్పటి కప్పుడు పిల్లల పూర్తి చిరునామాతో ఆన్లైన్ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు.
ప్రభుత్వ సహకారం ఇలా..
మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న పిల్లలకు మూడేండ్ల వరకు నెలకు రూ.4 వేల చొప్పున తల్లి, లేదా తండ్రితో కూడిన బ్యాంక్ జాయింట్ ఖాతాలో మూడేండ్ల వరకు డబ్బును జమ చేయనున్నారు. ఏడాదికి రూ.48 వేల చొప్పున మూడేండ్లలో ఒకొక్కరికీ రూ.1.44లక్షలు అందించనున్నారు. ఈ మొత్తంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా పథకం పూర్తి పర్యవేక్షణను ఐసీడీఎస్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం అప్పగింగించింది. అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో అర్హులైన వారిని గుర్తించేందుకు సర్పంచులు, ఎంపీటీసీల సహకారాన్ని తీసుకుంటున్నారు. దరఖాస్తులను అంగన్వాడీ టీచర్లు స్వీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోఎంపీటీసీ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎంతో కూడిన బృందం అర్హులైన వారి నుంచి దరఖాస్తు చేయిస్తున్నారు. బాలల పరిరక్షణ కమిటీ ముందుగా పరిశీలన చేసి అర్హత ఉన్న దరఖాస్తులను మండల స్థాయి కమిటీకి సిఫారసు చేసి పంపిస్తున్నది. వారు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి దరఖాస్తులను జిల్లా బాలల, పరిరక్షణ విభాగానికి పంపించారు. వారు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను సంబంధిత అంగన్వాడీ ప్రాజెక్టు సీడీపీవోకు నివేదిస్తారు. వారు లబ్ధిదారులకు సమాచారం అందించనున్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం..
తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏండ్లలోపు పిల్లలు, విడాకులు తీసుకున్న, ఒంటరిగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల పిల్లలు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, పునరావాసం అవసరమైన వారి పిల్లలు మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు ఫారాలు పొందొచ్చు. అనాథలు ఉంటే వారి తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం, చిన్నారుల విద్యార్హతలు, కుల, ఆదాయ, నివాస పత్రాలతోపాటు పిల్లల బ్యాంక్ ఖాతా, లేదంటే తల్లి, తండ్రి, సంరక్షుడి బ్యాంక్ జాయింట్ ఖాతా, ఆధార్, రేషన్కార్డు ఆన్లైన్ కాపీ, ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నది. వీలైతే గ్రామస్థాయి బాలల పరిరక్షణ సమితి తీర్మానం కాపీని పొందుపర్చాలి ఉంది.