మహబూబ్నగర్, జూలై 7 : భూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా అవసరమైన చర్యలు తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్ రవి నా యక్తో మాట్లాడారు. జీవో 59 కింద గతంలో వచ్చిన దరఖాస్తుల్లో 10లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన దరఖాస్తుదాలు ఇప్పటి వరకు చెల్లింపులు ప్రారంభించలేదని, వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపులు చేసేలా చూడాలన్నా రు. జీవో నెంబర్ 59 కింద లక్షలోపు చెల్లించాల్సిన దరఖాస్తుదారులకు కూడా నోటీసు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని తెలియజేశారు. భూముల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2 జూన్ 2020 కు పొడిగిస్తూ జీవో 58, 59, 76 కింద ప్రభుత్వం మరో మారు దరఖాస్తులను స్వీకరించిందని, వీటిని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు బృందాలను ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయి విచారణ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. జీవో 118 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 15 రోజులలోగా పూర్తి చేయాలన్నారు. ధరణిలో నూతనంగా 5 మాడ్యుల్స్ అందుబాటులోకి తెచ్చామని, ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు చిన్నచిన్న లోపాలను సవరించడం జరుగుతుందన్నారు.
ధరణిలో చేరిన నకిలీ సర్వే నెంబర్లు, డబుల్ సర్వే నెంబర్లు పరిష్కరించేందుకు మాడ్యుల్ తాసీల్దార్ లాగిన్లో జత చేశామని, కంపెనీలకు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులుంటే సవరించే అధికారాన్ని కలెక్టర్ లాగిన్లో అందించామని తెలియజేశారు. ఆధార్ సీడింగ్ సమయంలో పొరపాటు వల్ల ఒకరి భూమి మరో వ్యక్తికి అనుసంధానమైందని, దీని నివారణకు తాసీల్దార్ లాగిన్లో అవకాశం కల్పించామని తెలియజేశారు. నాలా కన్వెర్షన్ భూములు, ప్రభుత్వ భూముల్లో, ఇంటి జాగాలలో మిస్సింగ్ సర్వే నెంబర్లకు సర్వే నెంబర్లు కేటాయింపునకు అవసరమైన సవరణలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రైతు భూమిలో కొంత అమ్మినప్పుడు తన ఖాతాలో విస్తీర్ణం తొలగిపోలేదని, అలాంటి వాటిని సవరించేందుకు కలెక్టర్ లాగిన్లో అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
ఆర్ఎస్ఆర్ ప్యూరిఫికేషన్ కోసం ముందస్తుగా 5 ఎకరాలపై ఉన్న కేసులను మండలాల వారీగా గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరణిని అందరికీ మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో అనిల్కుమార్, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.