మరికల్, ఆగస్టు 14: గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరికల్ (Marikal) మండలంలో వరి, పత్తి, ఆముదం పంటలు నీట మునిగాయి. మరికల్ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు చేరి పలు కాలనీలో జలమయమయ్యాయి. రాయచూర్ ప్రధాన రహదారి ఇరువైపులా కాలనీలలోని ఇళ్ళలకు నీరు చేరింది. పెట్రోల్ బంక్ నీట మునిగింది. ప్రతి ఏడాది భారీ వర్షాలకు అంతర్ రాష్ట్ర రహదారిపై నీరు చేరి కాలనీలు నీట మునుగుతున్న సమయంలో మాత్రమే జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని పర్యటించి తాత్కాలిక పరిష్కారంతోనే చేతులు దులుపుతున్నారని విమర్శలు ఉన్నాయి.
చెరువుల ఆక్రమణకు గురికావడంతోనే వర్షపు నీరు రోడ్లపై చేరి కాలనీలో జలమయమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం, పెద్ద చింతకుంట, బుడ్డగాని తండాలకు వెళ్లే రహదారులు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పసుపుల ప్రాథమిక పాఠశాలలో నడుములోతు నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులను గ్రామపంచాయతీలో కూర్చోబెట్టి పాఠశాల నడిచే విధంగా చూస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.