ఊట్కూరు, జూలై 6 : నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో సోమవారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా దళిత సంఘం ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘం నాయకులు, జోగిని వ్యతిరేక వ్యవస్థ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ హాజమ్మ, మాజీ ఉప సర్పంచ్ కొండన్ గోపాల్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని దేశ సేవ చేసిన ఆయన, స్వాతంత్ర్యం అనంతరం దాదాపు మూడు దశాబ్దాలపాటు కేంద్ర మంత్రిగా వివిధ కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానీయుడిగా బాబు జగ్జీవన్ రామ్ నిలిచారని, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయం, రక్షణ, కార్మిక సంక్షేమం వంటి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండన్ భారత్, కొక్కు నరసింహ, తిమ్మప్ప, సహదేవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.