మాగనూరు మే 05 : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇండియన్ గ్యాస్ సమీపంలోని ఓ పొలంలో కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది. వరి పంటను కోస్తుండగా హార్వెస్టర్ డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. శవం పూర్తిగా కుళ్లిపోయిన గుర్తుపట్టనంతగా పాడైనట్లు ఉండటంతో దాదాపు వారం కిందట మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహం పక్కన ఉన్న సెల్ఫోన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తిని గుర్తించారు. మాగనూరు మండలం కోల్పూరు గ్రామానికి చెందిన కుర్వ జగలప్ప(48)గా పోలీసులు గుర్తించారు. అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
తన భర్త జగలప్ప ఏప్రిల్ 29వ తేదీన పని మీద రాయచూర్కు వెళ్లినట్లుగా మృతుడి భార్య లింగమ్మ పోలీసులకు తెలిపింది. రాయచూర్కు వెళ్లిన వ్యక్తి పంట పొలంలో ఎలా శవంగా మారాడనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.