నారాయణ పేట : రెండో విడత ఎన్నికలు జరిగే నారాయణ పేట జిల్లా సింగారం గ్రామ పంచాయతీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పదో వార్డు బూత్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరిగ్గా ఉదయం 8:25 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ నేరుగా బూత్ లోకి వెళ్లి ఓటు వేశారు. అనంతరం అక్కడున్న పోలింగ్ సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సరళిని పరిశీలించారు.
సింగారం గ్రామ మలుపు దారిలో గల కలెక్టర్ బంగ్లా సింగారం పరిధిలోని కౌరంపల్లి శివారులో ఉండటంతో కలెక్టర్ ఓటు సింగారం గ్రామంలో నమోదైంది. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం తన ఓటు హక్కును సింగారం పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. రెండో విడతలో దామర గిద్ద, నారాయణ పేట, ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా తాము పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నామని, అంతటా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.