Delimitation Bill : కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లులపై ముందడుగు పడనుంది. ఈ రెండు బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఇందుకోసం ఈ వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆగష్టు 16 నుంచి 18 వరకు, మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మూడు రోజులు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై పార్లమెంట్లో చర్చిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13న ముగుస్తాయి.
అనంతరం మరో మూడు రోజుల్లోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, రెండు బిల్లులపై చర్చిస్తారు. ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. ఎందుకుంటే ఇవి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులు. ఈ బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం అన్ని పక్షాల్ని సంప్రదిస్తోంది. ఒకవేళ తగిన మెజారిటీ లభిస్తే ఈ బిల్లులు ఉభయసభల్లో పాస్ అవుతాయి. ఈ నేపథ్యంలో రెండు బిల్లుల గురించి చర్చించేందుకు కేంద్రం.. కాంగ్రెస్ పార్టీని సంప్రదించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ఉదయం పార్లమెంట్లో కలుసుకున్నారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లును తిరిగి ప్రవేశపెట్టడంపై రాహుల్ గాంధీకి వివరించారు. ఈ బిల్లులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ బిల్లులపై కాంగ్రెస్ అభిప్రాయం తెలుసుకున్నారు.
ఇదే సమయంలో ప్రస్తుతం పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభన గురించి కూడా మాట్లాడారు. తాము అమిత్ షా రాజీనామా కోరడం లేదని, విద్యార్థులపై జరిగిన దాడిపై ప్రకటన చేయాలని మాత్రమే కోరుతున్నామని రాహుల్.. కిరణ్ రిజిజుకు వివరించారు. రెండు బిల్లలుపై చర్చించేందుకు రాహుల్ నిరాకరించినట్లు సమాచారం. రాహుల్తోపాటు పార్లమెంట్లో కీలక పార్టీలైన సమాజ్వాదీ పార్టీ నేతలను కూడా కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. ఇతర పార్టీల నాయకుల్ని కలిసి బిల్లులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతోంది బీజేపీ.