ఎన్నికల ప్రచారంలో విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 26: అచ్చంపేటను అభివృద్ధిలో మరో సిద్దిపేటగా మారుస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని ఛత్రపతినగర్కాలనీ (14వ వార్డు)లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేటలో 70ఏండ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలు ఏడేండ్లలో పరిష్కారమైనట్లు గుర్తు చేశారు. ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పంట పెట్టుబడులకు రైతుబంధు, బీమా, గర్భిణులకు కేసీఆర్ కిట్, 104 సౌకర్యం, 24గంటల విద్యుత్ సౌకర్యం కల్పించిన చరిత్ర సీఎం కేసీఆర్దేనని గుర్తు చేశారు. అదేవిధంగా పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, సమీకృత మార్కెట్, ఓపెన్ జిమ్, స్మృతివనం తదితర అభివృద్ధి పనులకు ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యనూ అసెంబ్లీ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానన్నారు. అచ్చంపేట అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 30న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి 20 వార్డులో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి విజయ ఢంకా మోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 14వ వార్డు అభ్యర్థి పులిజాల రమేశ్, నాయకులు యాదయ్య, శ్రీను, యాదగిరి, నరేశ్, గౌరీశంకర్, శేఖర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా కల్లోలం-పసుపు టీ విత్ లెమన్ తాగి చూడండి
సల్మాన్ కోసం రిస్క్ తీసుకుంటున్న లేడీ ప్రొడ్యూసర్