అచ్చంపేట : ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.
కోటి వృక్షార్చనలో భాగంగా అమ్రాబాద్ మండలంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి మంత్రి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడారు. దళితుల్లో వెలుగులు నింపే దళితబంధు(Dalitbandu) లాంటి కార్యక్రమం కేవలం తెలంగాణలోనే అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. రైటుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి (Kalyanalaxmi), ఉచిత విద్యుత్, కోటి యాభై లక్షల ఎకరాలకు సాగు నీరు, ఇంటింటికి మిషన్ భగీరథ (Misson Baghirath) ద్వారా తాగు నీరు అందుతుందని వెల్లడించారు.
తొమ్మిది సంవత్సరాలలో ఊహించని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు, రైతుబంధుకు రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఉమామహేశ్వరం ప్రాజెక్టును సాధించడం జరిగిందని త్వరలో టెండరు ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.