నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ మండలం ఎండబెట్ల గ్రామ శివారులో విద్యుత్ అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సేవకుల గాడి బుచ్చన్నకు చెందిన వ్యవసాయ పొలం (సర్వే నంబర్ 46)లో సుమారు 20 ఏళ్ల క్రితం నాటిన 18 భారీ టేకు వృక్షాలను విద్యుత్ లైన్కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో జేసీబీ సహాయంతో నేలకూల్చినట్లు ఆరోపిస్తున్నారు.
రైతుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అధికారులు ట్రీ కటింగ్ పేరుతో భారీ వృక్షాలను తొలగించారు. వాస్తవానికి ముందస్తు సమాచారాన్ని రైతుకు ఇచ్చి రైతు సమక్షంలో కొమ్మలను మాత్రమే తొలగించాల్సి ఉంది. కానీ విద్యుత్ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చెట్టు అమ్మలు తొలగించే సమయంలో దగ్గరుండి చూసుకోవాల్సిన విద్యుత్ అధికారులు అక్కడ లేకపోవడంతో ఇష్టానుసారంగా కూల్చారు.
శుక్రవారం ఉదయం రైతులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా అన్ని టేకు వృక్షాలు నేలకూలి ఉండటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో బాధిత రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 20 ఏళ్ల క్రితం నాటిన చెట్లకు అప్పట్లో నీళ్లు లేకపోయినా చెంబులతో నీళ్లు పోసి బతికించుకుందామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యుత్ అధికారులను సంప్రదించగా, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించి వృక్షాలను తొలగించిన వారిపై, టేక్ వృక్షాలని తెలిసి కూడా ఇష్టానుసారంగా చెట్లను నేల కుల్చిన జెసిబి యాజమానిపై చర్యలు తీసుకోవాలని, బాధిత రైతుకు తగిన న్యాయం చేసి నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శుక్రవారం పొలంలోకి వెళ్లిన భారీత రైతు గాడి బుచ్చన్న భార్య ప్రభావతమ్మ లు కంటికి రెప్పల కాపాడుకుంటూ వచ్చిన చెట్లను అడ్డవులుగా తొలగించడంపై కన్నీరు మున్నీరయ్యారు.
