నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పథకం ప్రారంభంలోనే అధికారుల అలసత్వం వల్ల అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో తప్పుడు నివేదికల నమోదు వంటి తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది.
నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం పోలిశెట్టి పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.బాలరాజు, బిజినపల్లి మండలం గంగారం గ్రామ కార్యదర్శి టి.నరేందర్ రెడ్డి, బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ జి.రజిని, ఊరుకొండ మండలం గుడిగానిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.రామచంద్రయ్యలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పనులలో జాప్యం, తప్పుడు నివేదికలు వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సమర్థంగా వినియోగించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉండగా నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.