Nagarkurnool | నాగర్కర్నూల్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఎన్హెచ్ -167 కే జాతీయ రహదారి కందనూలు జిల్లాకు మణిహారంగా మారనున్నది. కొల్లాపూర్ సమీపంలో సోమశిల వద్ద వారధి మీదుగా ఇటు కల్వకుర్తి నుంచి.. అటు ఏపీలోని నంద్యాల వరకు ‘హాయి’వే నిర్మాణం చేపట్టనున్నారు. రూ.1,800 కోట్లతో చేపట్టబోయే పనులకు ఇప్పటికే రూ.629 కోట్లు కేటాయించారు. ఇటీవలే ఓ సంస్థ టెండర్ దక్కించుకోగా.. కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో భూసేకరణ కొనసాగుతున్నది. ఈ రహదారితో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే దూరం 80 కిలో మీటర్లు తగ్గుతుంది. ఈ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఇరు ప్రాంతాలకు రాకపోకలు పెరిగి సంబంధాలు పెరగనున్నాయి. వ్యాపార, వాణిజ్య పరంగా నాగర్కర్నూల్ జిల్లా మరింత అభివృద్ధి చెందనున్నది. ఇప్పటికే రియల్ వ్యాపారం జోరందుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లాకు 167-కే రూపంలో జాతీయ రహదారి నిర్మాణం కాబోతున్నది. కల్వకుర్తి నియోజకవర్గం కొట్ర నుంచి ఏపీలోని నంద్యాల వరకు రూ.1,800 కోట్లతో జాతీయ రహదారి నిర్మించనున్నారు. మొదటి విడుతలో కొట్ర నుంచి మల్లేశ్వరం వరకు నాలుగు లేన్ల రహదారికిగానూ రూ.629 కోట్లు కేటాయించగా.. ఇటీవలే ఓ సంస్థ టెం డర్ దక్కించుకున్నది. కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ రహదారితో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వారికి 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనున్నది తెలంగాణతోపాటు రాయలసీమ ప్రాంతాల మధ్య వివిధ వ్యాపార వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తిరుపతికి జడ్చర్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే దూరభా రం, వ్యయప్రయాసాలు తగ్గుతాయి. దశాబ్దానికిపైగా ఈ రహదారి ప్రతిపాదనలో ఉండగా.. ఇటీవలే కొలిక్కివస్తున్నది. కొట్ర నుంచి కొల్లాపూర్లోని మల్లేశ్వరం వరకు 86 కిలోమీటర్ల మేర రహదారి ఉన్నది. దీని ఏర్పాటులో భాగంగా రూ.600 కోట్లతో కృష్ణానదిపై కేబుల్బ్రిడ్జి కూడా నిర్మించనున్నారు.
ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా నిలువనున్నది. ఈ రహదారి వల్ల హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటున్నది. చౌరస్తా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా కౌన్ పూచ్తా హై కొల్లాపూర్ అనే నానుడి చరిత్రలో మిగిలిపోనున్నది. కొల్లాపూర్ నియోజకవర్గంలో జాతీయ రహదారి భూములకు ఎ క్కడా లేని ధరలు వచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కాగా, జాతీయ రహదారి మొదటి దశ పనులకు టెండర్ పూర్తి కాగా.. ఇరువైపులా బైపాస్ రహదారుల నిర్మాణాలకు టెండర్లను పూర్తి చేయాల్సి ఉంది. కల్వకుర్తి, నాగర్కర్నూల్, సింగోటం క్రాస్రోడ్లలో సోమశిల రోడ్డు ప్రాంతాల్లో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ జంక్షన్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం మీదుగా నిర్మిస్తున్న 167 కే తొలి జాతీయ రహదారి. ఈ రోడ్డు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలకు సమీపంగా వెళ్లన్నుది. అలాగే కృష్ణానది అనుసంధానంగా చేపట్టిన ఎంజీకేఎల్ఐ, త్వరలో పూర్తి కాబోతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులతో జాతీయ రహదారి పచ్చదనం సంతరించుకోనున్నది. జాతీయ రహదారి పనులను కొలిక్కి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో పలుసార్లు ప్రస్తావించారు. దీంతో కేంద్రం పనుల పురోగతికి నిధులను కేటాయించింది.
నాగర్కర్నూల్ జిల్లాలో 167 కే జాతీయ రహదారి మంచి మార్పును తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటు కేంద్ర మంత్రులను కలిసి రహదారి ఆవశ్యకతను వివరించాం. ఇటీవలే తొలి విడుత పనులకు ఓ సంస్థ టెండర్ దక్కించుకున్నది. త్వరలో పనులు ప్రారంభించేలా కృషి చేస్తా.
– పోతుగంటి రాములు, నాగర్కర్నూల్ ఎంపీ