తెలకపల్లి, ఆగస్టు 29 : అభివృద్ధి చేయకుండా ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టడం కాంగ్రెస్ నైజం అని, అభివృద్ధి చేసి చూపించడం బీఆర్ఎస్ లక్ష్యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని గౌతంపల్లి, గడ్డంపల్లి, అనంతసాగర్, బండపల్లి గ్రామాల్లో మంగళవారం పదేండ్ల ప్రజా ప్రస్తానంలో భాగంగా ఎమ్మెల్యే మర్రి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బాసులు ఢిల్లీలో ఉంటే తమకు తెలంగాణ రాష్ట్రంలోని గల్లీల్లో ఉన్నారని కాంగ్రెస్ను నమ్మితే కష్టాలు తప్పవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసరా పింఛన్లతో వృద్ధులకు తోడుగా నిలబడడం జరిగిందన్నారు. నిత్యం కరువు, కాటకాలతో అలమటించే రైతాంగానికి కేఎల్ఐ ద్వారా కృష్ణాజలాలను అందించినట్లు చెప్పారు. నాణ్యమైన విద్యుత్తోపాటు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతు బతుకులకు భరోసా కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. పల్లెప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛ గ్రామాలను తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిని ప్రవేశపెట్టడం జరిగిందని, గ్రామాల్లో మౌలిక అవసరం మెరుగుపర్చడానికి సీసీరోడ్ల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇటువంటి అబివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర చేష్టలతో తప్పుడు ఆరోపణలతో ప్రజలను మాయమాటలు చెప్పి మభ్య పెట్టడానికి చూస్తున్నారని విమర్శించారు. తాను చేసిన అబివృద్ధి కళ్ల ముందు కనబడుతుందని తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, ఎమ్మెల్యే సతిమణి మర్రి జమున, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకని శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, ఎంపీపీ మధు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాధవరెడ్డి, విండో చైర్మన్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
రైతులను కాల్చిన చరిత్ర కాంగ్రెస్ది
కాంగ్రెస్ పార్టీ రైతులకు కరెంట్ ఇవ్వలేదని, ఆందోళన చేసిన రైతులను కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అలాంటి పార్టీని సీఎం కేసీఆర్ ఇస్తున్న 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకంతో రైతులే కాల్చివేశారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెఢ్డి అన్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండలం పెద్దపల్లిలో విలేకర్లతో ఎమ్మెల్యే మాట్లాడారు. తన పదేళ్ల ప్రజాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా గ్రామగ్రామాన పాదయాత్రగా పర్యటిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా ఆలేరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రసంగిస్తుంటే పేపర్లో పడేందుకు ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలారన్నారు. కట్టిన దిమ్మెలను కూలగొట్టారన్నారు. కాంగ్రెస్ నైజం కూల్చడమని, బీఆర్ఎస్ నైజం నిర్మించడమని గుర్తు చేశారు. తన సభలో వేలాది మంది ప్రజలు ఉన్నారని, నలుగురు వచ్చి అల్లరి చేస్తుంటే చిటికేస్తే ఇక్కడ ఉండరని, ఇండ్లల్లో నుంచి బయటికి రారని, అందుకే తాను కాల్చి చంపుతానని మాట్లాడానని, ఇది తన మాట కాదని ప్రజల గుండెల్లో ఉన్నదే చెప్పానన్నారు. తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేస్తాననడం సరికాదన్నారు.