Nagarkurnool | నాగర్కర్నూల్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. జిల్లా కేంద్రంలో నూతనంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ సంసిద్ధం కాగా.. ఎస్పీ రాజభవనాన్ని తలపిస్తున్నది. సకల హంగులతో పోలీస్ ఆఫీసర్ల క్వార్టర్లను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల జిల్లాకే తలమానికంగా నిలవగా.. మినీ ట్యాంక్బండ్ అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. దీంతో జిల్లా కేంద్రం కొత్త సొబగులను సంతరించుకున్నది. అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్నది. జిల్లా ఏర్పడిన తక్కువ సమయంలోనే ప్రగతి పరుగులు పెడుతున్నది.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు జిల్లాకేంద్రంగా వెలుగు వెలిగిన కందనూలు తెలంగాణ ఏర్పడ్డాక కొత్తరూపు సంతరించుకున్నది. మెడికల్ కళాశాల ఏర్పాటుతోపాటు సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు రాచఠీవికి దర్పణంగా నిలుస్తున్నాయి. ఉమ్మడిరాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు. కానీ, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్దన్రెడ్డి అభివృద్ధిలో తనదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్నాడు. జిల్లా కేంద్రం నాలుగు దిక్కులా పరిపాలనా కార్యాలయం భవనాలు, మెడికల్ కళాశాల, మినీ ట్యాంక్బండ్ జిల్లాకేంద్రానికే వన్నె తెచ్చాయి. కేఎల్ఐ కింద నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. వట్టెం రిజర్వాయర్, పాలెం అగ్రికల్చర్ కళాశాల జిల్లాకు తలమానికంగా మారా యి. అదేవిధంగా నాగర్కర్నూల్ జిల్లా రియల్ ఎస్టేట్లో కూడా పుంజుకున్నది. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలోనే పెద్ద నగరంగా మారడంలో సందేహం లేదు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ ఒకప్పుడు తొలి జిల్లాకేంద్రంగా ఖ్యాతి గడించింది. జనాభా, ఇతర ప్రాతిపదికన మహబూబ్నగర్ను జిల్లాకేంద్రంగా మార్చారు. ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా మారింది. 2019లో నియోజకవర్గాల పునర్విభజనలో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో గద్వాల, అలంపూర్ చేరాయి. దీంతో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువ కావడంతో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది. తెలంగాణ ఏర్పడ్డాక నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంగా మారింది. దీంతో పూర్వ వైభవం సంతరించుకున్నది. నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలను కలిపి జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేశారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో అటవీప్రాంతం ఎక్కువ. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కూడా. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించి మంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడంతో 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్రెడ్డి విజయం సాధించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మర్రి అభివృద్ధిలో దూసుకుపోతున్నారు.
గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతంత మాత్రమే జరిగింది. మావోయిస్టుల ఉనికి కోల్పోయాక అభివృద్ధికి బాటలు పడ్డాయి. తెలంగాణ ఏర్పడ్డాక నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం కావడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఇటీవల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతోపాటు సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. అలాగే నర్సింగ్ కళాశాల మంజూరైనది. పాలెం అగ్రికల్చర్ పరిశోధనా కేంద్రానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. జిల్లాకేంద్రం సమీపంలో మినీట్యాంక్బండ్, కొల్లాపూర్ చౌరస్తాలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించడంతో చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మెడికల్ కళాశాల, జిల్లా ప్రధాన కార్యాలయాల చుట్టూ గజం స్థలానికి రూ.50వేలు పలుకుతున్నది. ఇతర ప్రాంతాల వారు పట్టణంలో ఉండడానికి ఇష్టపడడంతో అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలో నిర్మాణాలు జోరందుకున్నాయి. దీంతో అనేక టౌన్షిప్లు రంగ ప్రవేశం చేశాయి. బస్టాండ్ చుట్టు పక్కలే కనిపించిన అభివృద్ధి ఇప్పుడు శివారు ప్రాంతానికి చేరుకున్నది. దీంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా నిలిచింది. జిల్లా అభివృద్ధిలో మర్రి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్నది.
నాగర్కర్నూల్ జిల్లా ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఆఫీసర్ల క్వార్టర్లు నిర్మిస్తున్నారు. దీంతో కొల్లాపూర్చౌరస్తాకు డిమాండ్ ఏర్పడింది. రూ.51కోట్ల వ్యయంతో సమీకృత కలెక్టరేట్ పనులు పూర్తికావచ్చాయి. గార్డెనింగ్, లాన్ పనులు నడుస్తున్నాయి. కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటుతున్నారు. అన్నిశాఖల చాంబర్లు సిద్ధమవుతున్నాయి. ఆవరణ చుట్టూ సీసీ పనులు కొనసాగుతున్నాయి. మరో వైపు రూ.35కోట్లతో ఎస్పీ కార్యాలయం పనులు చేస్తున్నారు. కార్యాలయం ఆవరణలో పెయిటింగ్ వరకు పూర్తికాగా వైరింగ్, మొక్కలు నాటడం, గ్రీనరీ పనులు నడుస్తున్నాయి. ఈ రెండు కార్యాలయాల సమీపంలోనే ఆఫీసర్ల క్వార్టర్లు ముస్తాబవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కొల్లాపూర్ రహదారికి ఇరువైపులా ఉండడంతో ఈ ఏరియాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొత్త కొత్త వెంచర్లు, కాలనీలు, ఫంక్షన్హాళ్లు
వెలుస్తున్నాయి.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నాగర్కర్నూల్ అభివృద్ధి జరుగుతున్నది. త్వరలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తాం. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసినందుకే ప్రజలు తిరస్కరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులతోపాటు ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నాం.
– మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్కర్నూల్