అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. పాలమూరు బల్దియాలోని క్రిస్టియన్పల్లి పరిధిలోని సర్వేనెంబర్ 523లోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించారు. పోలీస్ సహకారంతో రెవెన్యూ శాఖాధికారులు రంగంలోకి దిగారు. దాదాపు 60 నిర్మాణాలను గుర్తించామని, 15 కట్టడాలను నేలమట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్లు మహబూబ్నగర్ అర్బన్ తాసీల్దార్ రాధాకృష్ణ తెలిపారు. అయితే స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా నిర్మాణాలను కూల్చడం
ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పేదలైన తమను ఆదుకోవాలని
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 11 : మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని క్రిస్టియన్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 523లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్లో బేస్మెంట్స్, ప్రహారీలను నిర్మించుకున్నారు. మరికొందరు చిన్నపాటి ఇండ్లు కూడా కట్టుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ముందస్తుగా రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి ఉద్రిక్తపరిస్థితులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలు పలుసార్లు చెప్పినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటుండగా బాధితులు మాత్రం మేము నిరాశ్రయులం.. ఏండ్ల తరబడి ఇక్కడే జీవనం సాగిస్తున్నామంటూ వాపోతున్నారు. ముందు నుంచి సర్వే నెంబర్ 523 వివాదాలకు కేరాఫ్గా ఉంటూ వస్తుంది. గతంలోనే సర్వే నెంబర్లో గత ప్రభుత్వం 330 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందించిన విషయం విధితమే. ఈ తరుణంలో ఉన్న భూముల్లోనూ కొంతమందికి ఇప్పటికీ పట్టాలు ఉన్నట్లు మరికొందరు అంటున్నారు. ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు, ముగ్గురికి కూడా పట్టాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నట్లుండి ఇప్పుడే రెవెన్యూ అధికారులు తీసుకున్న చర్యలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లు తెలుస్తుంది. ఈ భూముల్లో గతంలో రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయని గతంలో ఆరోపణలు వచ్చాయని ఆ ప్రాంతంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చి వేయడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే నెంబర్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తూ కూల్చివేస్తే బాగుటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం గతంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి 30మందిని బైండోవర్ చేసినట్లు చెబుతున్నారు. అధికారులు ఓ వైపు నిబంధనలు అంటున్నా..ఆ ప్రాంత ప్రజలు మాత్రం మేము పేదలం మమల్ని ఆదుకోవాలంటు వాపోతున్నారు.
సర్వే నెంబర్ 523లో భూ వివరాలు అన్నీ పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పటి వరకు 60 అక్రమ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించాం. సోమవారం 15 అక్రమ కట్టడాలను కూల్చివేశాం. ఈ విషయంపై చట్ట ప్రకారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.