బిజినేపల్లి, అక్టోబర్ 6 : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెసోళ్లు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదేండ్ల ప్రస్థానంలో భాగంగా శుక్రవారం బిజినేపల్లి మండలంలోని ఊడ్గులకుంట తండా, కీమ్యాతండా, పెద్దతండా, వసురాంతండా, పోలేపల్లి, బోయపూర్, బిజినేపల్లి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెసోళ్లు చెప్పే మాయమాటలు నమ్మవద్దని సూచించారు. కేఎల్ఐ ద్వారా సాగునీరు అందని గ్రామాలు, తండాల రైతుల పంట పొలాలకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడి రూ.100 కోట్ల వ్యయంతో మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టమన్నారు. ఈ రిజర్వాయర్ను ఈనెల చివరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో 17 తండాలు, 5 గ్రామాల రైతు పొలాలకు సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. గతంలో తండాల ప్రజలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారన్నారు. బిజినేపల్లి మండలంలో గిరిజన తండాలు ఎక్కువగా ఉండడం వల్ల త్వరలో తండావాసులకోసం గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంతో సాగు, తాగునీరు లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతులకు 24 గంటల కరెంటు, రైతుబీమా, రైతుబంధు ఇవ్వడం జరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, పులేందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ బాలరాజుగౌడ్, విజయ్, బాలస్వామి, శంకర్నాయక్, రవినాయక్, మంగ్లి, బోజ్యానాయక్, అంజి, లిమ్యానాయక్, అశోక్, వెంకటయ్య, శ్రీను, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.