రాజాపూర్, సెప్టెంబర్ 27 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు గ్రామాలకు చెందిన 194మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందజేశారు. 29మందికి కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల తెలంగాణకు వచ్చిన సోనియాగాంధీ మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వమని అడగడం సిగ్గుచేటన్నారు. 70 ఏండ్ల పాలనలో తాగేందుకూ చుక్కనీరు ఇవ్వని నాయకులు ఇప్పుడేదో చేస్తామనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడానికి రోజులు సరిపోవని కొనియాడారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న కేసీఆర్లాంటి నాయకుడు దేశంలో మరెక్కడాలేడని స్పష్టం చేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. గృహలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని, మండలంలోని అర్హులందరికీ ఇండ్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, తాసీల్దార్ విద్యాసాగర్రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్ బచ్చిరెడ్డి, బీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, ఏఎంసీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్, సెప్టెంబర్ 27 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మా ట్లాడారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో అమలు కావడం లేదని, చేతనైతే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాలను అమలు చేయాలన్నారు. 70 ఏండ్లల్లో ప్రజలను మభ్యపెట్టి దోచుకున్నారే తప్పా అభివృద్ధిని మరిచారన్నారు.
3గంటల కరెంట్ కావాలా? 3 పంటల కరెంట్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు.. ఇచ్చిదీ లేదని ఎద్దేవా చేశారు. పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ, వైస్ఎంపీపీ తిరుపతమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, సర్పంచులు జంగిరెడ్డి, రాధిక, నాయకులు సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, బాలు, నారాయణరెడ్డి, జైపాల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసులు, శివప్రసాద్, కాడయ్య, వీరారెడ్డి, బీరయ్య, శేఖర్, మల్లయ్య, బంగారు, గోపాల్, జగన్గౌడ్ తదితరులు ఉన్నారు.