అమరచింత, మార్చి 27: దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సీఎం కేసీఆర్ కారణంగా తమకు భవిష్యత్తు ఉండదనే భయంతో పీఎం మోడీ ఈడీ అధికారులతో బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని.. ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడడని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్ల కవిత, నామ నాగేశ్వర్రావు, మల్లారెడ్డి, గంగుల కమాలకర్పై దాడులు చేయించడం కక్షసాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. అమరచింత శివారులోని వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మక్తల్ నియోజకవర్గంలోని బీడుభూములకు పుష్కలంగా సాగునీరు అందించామన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కొన్ని పనుల్లో జాప్యమవుతోందని. రెండు, మూడు నెలల్లో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మనస్సు గెలుచుకుందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవరి మల్లప్ప మాట్లాడుతూ ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న బీజేపీకి, తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. అనంతరం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. సమ్మేళనంలో మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, జెడ్పీటీసీ సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ఎంపీపీ బాల్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజేందర్సింగ్, మార్కెట్కమిటీ మాజీ వైస్చైర్మన్ నాగభూషణంగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు, బీఆర్ఎస్ మండల నాయకులు నరేశ్రెడ్డి, రమేశ్, నర్సింహులుగౌడ్, పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.