మక్తల్ టౌన్, నవంబర్ 15 : గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలతో వస్తున్న కాంగ్రెస్ను నమ్మితే చీకటి రోజులు వస్తాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ మండలంలోని చిన్నగోప్లాపురంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారెంటీ లేని ఆరు గ్యారెంటీలను చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మోసపోతామన్నారు. ఇవే ఆరు గ్యారెంటీలతో కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఓటేసిన పాపానికి నేడు గోసపడుతున్నారన్నారు. తాగడానికి నీళ్లు, 5గంటల కరెంటుతో తంటాలు పడుతున్నారని తెలిపారు. పంటలు ఎండి రైతులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తుంటే ఒక్కడొచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు.
ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయని, మరోసారి మోసగాళ్లను నమ్మి నట్టేట మునగవద్దని కోరారు. సీఎం కేసీఆర్ హయాంలోనే పదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థాయికి చేరుకున్నదన్నారు. మన రాష్ట్రంలోని పథకాలు ఇతర ఏ రాష్ర్టాల్లోనూ అమలు కావడం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, లేదంటే కష్టపడి సాధించిన ప్రగతి వెనక్కివెళ్లిపోతుందన్నారు. సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేసేందుకు ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలోని ఇతర పార్టీలకు చెందిన 50మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చిట్టెం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పసుపుల సర్పంచ్ దత్తప్ప, చిన్నగోప్లాపూర్ సర్పంచ్ కృష్ణయ్యశెట్టి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీకాంత్రెడ్డి, విష్ణురెడ్డి, వీరారెడ్డి, హన్మంతు, శంకరయ్య, శంకరయ్యగౌడ్, నారాయణగౌడ్, గోవిందు, ఆవుల శీను, చెన్నప్ప, సుధాకర్గౌడ్, లక్ష్మణ్తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.