మక్తల్ టౌన్ డిసెంబర్ 23: దేశంలో రైతు జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు నిలబడిన చరిత్ర లేదని, త్వరలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం మక్తల్ పట్టణంలోని నారాయణపేట రోడ్డు క్రాస్ వద్ద 167వ నెంబర్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ కేంద్రం రైతులపై నిరంకుశ పాలన కొనసాగిస్తుందన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం కింది రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు నిర్మించిన కల్లాలకు సంబంధించిన రూ. 151 కోట్ల నిధులను తిరిగి కేంద్రానికి చెల్లించాలని కొర్రి పెట్టడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దేశానికే తలమానికంగా మారిందని, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ర్టాలకు ధాన్యాన్ని సరఫరా చేస్తున్న స్థాయిని చూసి తట్టుకోలేకనే కేంద్ర సర్కార్ వ్యవ సాయ రైతులపై నిరంకుశ పాలనను అవలంబిస్తుందన్నారు. రైతు జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు బతికి బట్టకట్టలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎంపీపీ వనజ, కౌన్సిలర్లు శ్వేత, మొగులప్ప, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు రవింధర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ రాజేశ్గౌడ్, యువజన నాయకులు గార్లపల్లి నర్సింహారెడ్డి, రామలింగం, విష్ణు, మక్తల్, మాగనూర్, కృష్ణ, ఊట్కూర్ మండలాల జెడ్పీటీసీ, ఎంపిటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.