సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని.. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలు మారాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో గిరిజన గురుకుల పాఠశాల భవనాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పర్భద్రకు జాతీయ హోదా ఇచ్చి.. పాలమూరు ఎత్తిపోతలను కేంద్రం విస్మరించిందన్నారు.
జడ్చర్ల, మే 31: సర్కారు బడుల్లో కార్పొరేట్ విద్యను అందిసూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం జడ్చర్ల మండలంలోని కోడ్గల్లో రూ.4.20కోట్లతో నిర్మించిన తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అలాగే రూ.5కోట్లతో చేపట్టనున్న గిరిజన డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ భవన సముదాయం పనులకు శంకుస్థాపన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రూ.70లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణణ్ విగ్రహావిష్కరణతో పాటు రూ.10లక్షలతో నిర్మించిన కాలిబాట, సెంట్రల్ లైటింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన తదితర అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ర్టాల్లో అధికారం సాధ్యం కాదనే విషయం అర్థమై కేంద్రంలోని బీజేపీ కుట్రలకు తెరతీస్తోందని విమర్శించారు.
రాష్ర్టంలోని 33 జిల్లాలకు 33 ఎంపీ స్థానాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదన్నారు. పాలమూరు-రంగారెడ్డిపై మాట మాట్లాడకుండా వివక్ష ప్రదర్శిస్తూనే ఉందని తె లిపారు. ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చే శకం ముగిసిందని ఓ వైపు చెప్తూనే కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరించి ఈ ప్రాంతానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. యాసంగిలో దేశవ్యాప్తంగా 96లక్షల ఎకరాల్లో వరిధాన్యం పండిస్తే కేవలం తెలంగాణలోనే 56లక్షల ఎకరాల్లో వరి సాగయ్యిందన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు జడ్చర్లలోని పాడుబడిన రెండు మెట్లబావులను పునరుద్ధ్దరిస్తామని త్వరలో పురావస్తు, పర్యాటకశాఖల నుంచి అధికారులను పంపించి అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన, వసతులు కల్పించేందుకు మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణకు ముందు ఏవిధంగా ఉండింది.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు. గ్రామాలు పచ్చబడుతున్నాయని, ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. గంతలో నియోజకవర్గంలో నాలుగు ఇంటర్మీడియట్ కళాశాలలు ఉండేవని, ప్రస్తుతం రెసిడెన్షియల్ పాఠశాలలు అప్గ్రేడ్ చేయడంతో 14జూనియర్ కళాశాలలు ఉన్నట్లు వివరించారు.
కాంగ్రెస్ హయాంలోనే జడ్చర్ల అభివృద్ధి చెందిందని రేవంత్రెడ్డి ఇటీవల జడ్చర్లలో జరిగిన సభలోఅన్నారని, దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధ్దికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఎంపీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధ్ది స్పష్టంగా కనబడుతోందన్నారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, వైస్చైర్మన్ దానిశ్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, సర్పంచులు మమతా నవీన్రెడ్డి, హైమావతి, శ్రీనివాసులు, బాలసుందర్రెడ్డి, మోహన్నాయక్, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, డీఈవో రవీందర్, ఆర్డీవో అనిల్కుమార్, ఎంఈవో మంజులాదేవి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.