మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 22 : మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున మంత్రి నివాసానికి తరలివచ్చి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మంత్రి నివాసం కిక్కిరిసిపోయింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 70 ఏండ్లలో సాధించని ప్రగతిని పదేండ్ల అతి తక్కువ సమయంలో మహబూబ్నగర్లో ఎవరూ ఊహించని అభివృద్ధి చేసి చూపించామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్ సహకారంతో అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, అన్ని రంగాల్లో వెనుకబడిన పాలమూరు రూపు రేఖలు మార్చినట్లు తెలిపారు. 14 రోజులకు ఒకసారి వచ్చే తాగునీటి కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి నుంచి నట్టింట్లోకి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
ఉపాధి లేక వలసలు వెళ్లే దశ నుంచి స్థానికంగానే ఐటీ కొలువులు చేసుకునే వరకు అభివృద్ధి సాధించామన్నారు. 10వేల మందికి ఉద్యోగాలను కల్పించే లిథియం గిగా పరిశ్రమను తీసుకువచ్చామన్నారు. భవిష్యత్తులో హన్వాడ ఫుడ్పార్కుతోపాటు మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దఎత్తున ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. యువతకు క్రీడల్లో అవకాశాలు కల్పించేందుకు స్టేడియాన్ని ఆధునీకరించడంతోపాటు రెండు మినీ ఇండోర్ స్టేడియాలను నిర్మించామన్నారు. స్థానికంగానే అధునిక వైద్య సేవలు అందించేందుకు వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్నామన్నారు.
దేశవిదేశాల నుంచి పర్యాటకులు సందర్శించేలా 26వేల ఎకరాల్లో జంగల్ సఫారీని విస్తరిస్తున్నామని, బర్డ్ ఎన్క్లోజర్ ద్వారా వేలాది పక్షులను ఒకేచోట తిలకించేందుకు వీలవుతుందన్నారు. మన్యంకొండ వద్ద తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే, పర్యాటకుల సౌలభ్యం కోసం రెండు అతి పెద్ద బడ్జెట్ హోటళ్లను నిర్మిస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం పాలమూరు పట్టణానికి కొత్తరూపును తీసుకొచ్చాయన్నారు. ఇప్పటికే పాల్కొండ నుంచి బైపాస్ రోడ్డు నిర్మించామని, త్వరలోనే భూత్పూర్ నుంచి చిన్నదర్పల్లి వరకు నిర్మంచే బైపాస్ రోడ్డుతో రాకపోకలు మరింత సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అన్ని రంగాల్లో మహబూబ్నగర్ను నెంబర్వన్ చేసేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని ఓర్వలేక కొందరు కుట్రలు చేస్తున్నారని, వారిపట్ల అప్రమతంగా ఉండాలని కోరారు.