మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెంటనే పట్టణంలోని పెద్ద చెరువులోకి వర్షపు నీటిని మళ్లించాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గత 40 ఏళ్లుగా పెద్ద చెరువు కింద వ్యవసాయం లేక తూము పూర్తిగా డ్యామేజీ అయ్యిందని.. ఆ తూమును ప్రస్తుతం పునరుద్ధరించినందున వెంటనే చెరువులోకి నీటిని వదలాలాని జిల్లా కలెక్టర్ వెంకట్రావును మంత్రి ఆదేశించారు.
మునుగోడులో ఉన్న మంత్రి ఫోన్ ద్వారా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పెద్ద చెరువు పరిధిలో ఉన్న రెండు అలుగులు, ప్రస్తుతం రిపేరు చేసిన తూము ద్వారా మూడు వైపుల నుంచి వర్షపు నీరు దిగువకు వెళ్లడం వల్ల లోతట్టు ప్రాంతాల సమస్య తీరుతుందని ఆయన తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న తూము డ్యామేజీ అయిపోయి, కాలువ పూడుకుపోవడం వల్ల చెరువు నుంచి నీటిని వదలడం కష్టంగా మారిందని.. ప్రస్తుతం తూము మరమ్మతులు, దాని పరిధిలోని కాలువ పనులు 70శాతం పూర్తయినందున వెంటనే పట్టణంలో ఎగువ నుంచి వచ్చే నీటిని చెరువులోకి మళ్లించాలని ఆదేశించారు.
బీకే రెడ్డి కాలనీవైపు కాలువ ద్వారా నేరుగా వెళ్తున్న నీటిని ఆ కాలువను తెంపి వర్షపు నీటినంతటినీ చెరువులోకి వదలాలని సూచించారు. ప్రస్తుతం చెరువులోకి నీటిని మళ్లించడం వల్ల సమస్య తీరుతుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎన్ని కోట్లు ఖర్చయినా ఇండ్లు మునిగిపోకుండా నాలాల ద్వారా నీరు వెళ్లేలా, ఎక్కడ కూడా ముంపు సమస్యే లేకుండా చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురవడం వల్లే పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలకు సమస్య ఏర్పడుతోందని ఆయన తెలిపారు.
ఎన్ని కోట్ల నిధులు ఖర్చు అయినా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి లోతట్టు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. బీకే రెడ్డి కాలనీ, రామయ్యబౌలి ప్రాంతాల వైపు వర్షపు నీరు పోకుండా నేరుగా చెరువులోకి తక్షణమే మళ్లించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. చెరువు నిండేందుకు కనీసం రెండు రోజుల సమయం పడుతుంది కాబట్టి అంత లోపు తూము కాలువ మిగతా పనులు పూర్తి చేయాలన్నారు. రెండు అలుగులు, తూము ద్వారా వర్షపు నీరు కిందకు వెళ్తుంది కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.