Current Shock | పాపన్నపేట, జూలై 21: మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చెన్పల్లి గ్రామంలో విద్యుత్ షాక్కు గురై సర్పంచ్ తండ్రి మరణించాడు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ వెంకటయ్య (యేసు) తండ్రి ఏరోళ్ల కిష్టయ్య (56) మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న సంప్ నుంచి మోటార్ ద్వారా పైకి నీటికి ఎక్కించబోయాడు. అయితే సోమవారం రాత్రి వర్షం కారణంగా మోటార్ తడిసి ఉంది. ఈ క్రమంలో మోటార్ ఆన్ చేయగానే కిష్టయ్య విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించి కుటుంబసభ్యులు వెంటనే మెదక్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ కిష్టయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.