మహబూబ్నగర్, నవంబర్ 30 : ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఓటు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్కాలనీలోని పద్మాలయ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 100లో మంత్రి శ్రీనివాస్గౌడ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పది సంవత్సరాల కిందట ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో ఎన్నో సమస్యలతో వేశామని గుర్తు చేశారు. తాగునీరు నుంచి ఎన్నో సమస్యలతో మహబూబ్నగర్ ఉండేదని తెలిపారు. గడిచిన 70 సంవత్సరాల నుంచి పడిన సమస్యలను, గిప్పుడు తిరిన సమస్యలను ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారని తెలియజేశారు. అప్పటి వలస జీవితాలను దుర్భర బతుకులను మననం చేసుకుంటున్నారని, నేడు ఎన్నో విధాలుగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంను ఆగం చేయకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రజలు రాత్రి నుంచి ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ చేతుల్లోకి రాష్ర్టాన్ని పెడితే ఆగమవ్వడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారని తెలియజేశారు. పదేండ్లలో ఎంతో సాధించాం, మరెంతో సాధించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి చూపించడం జరుగుతుందన్నారు. 10వేల మందికి ఉద్యోగాలను అందించే లిథియం ఆయాన్ గిగా పరిశ్రమ లాంటివి మరెన్నో తీసుకురావడం జరుగుతుందని వివరించారు. గత ఎన్నికల కంటే ఈ ఎడాది మాకు మరింత మెజార్టీ వస్తుందని పేర్కొన్నారు. ప్రశాంతమైన మహబూబ్నగర్ను చేయడమే మా సంకల్పమని పేర్కొన్నారు.
ఆత్మకూరు, నవంబర్ 30 : బీఆర్ఎస్ అ భ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల పోలింగ్బూత్లను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
నవాబ్పేట, నవంబర్ 30 : మండలంలోని గురుకుంట గ్రామంలోని 22 వ పోలింగ్ బూత్లో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం గురుకుంట గ్రామానికి చేరుకున్న ఎంపీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించున్నారు. ఎంపీతో పాటు ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత మన్నె సత్యనారాయణరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు మన్నె జీవన్రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.