మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 26 : కొత్తగా ఇల్లు నిర్మించేవారు ముందుగా మొక్కలు నాటాలని అబ్కారీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ బైపాస్ రోడ్డు డివైడర్పై ఖర్జురా మొక్కలు నాటి.. జిల్లాలో 4లక్షల 20వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణకు చెట్లే ముఖ్యమని, అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఈ ఏడాది జిల్లాలో 55లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జంగల్ సఫారీలో భాగంగా రెండు వాహనాలను ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా అతిపెద్ద పక్షుల ఎన్క్లోజర్ ఏర్పాటు చేసి వెయ్యి పక్షులను పెంచే కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. మన్నెకొండలో రోప్వేతోపాటు ఎనిమిది లిఫ్టుల ద్వారా కొండపైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీ సైతం ఇంటి అనుమతులకు ముందుగా మొక్కలు నాటేలా నింబంధనలను విధించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, డీసీసీబీ ఇన్చార్జి అధ్యక్షుడు వెంకటయ్య, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నటరాజ్, అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఎఫ్వో సత్యనారయణ, డీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
దేశంలోనే చేపల ఉత్పత్తిలో తెలంగాణ టాప్లో నిలిచిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శనివారం పాలకొండ చెరువులో మంత్రి చేపపిల్లలు వదిలి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేసి ముదిరాజ్లను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, మత్స్యశాఖ ఏడీ రాధారోహిణి, కౌన్సిలర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలను యజమానులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జేజేఆర్ ఫంక్షన్ హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మోప్మా)సిబ్బంది, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. హైదరాబాద్ గాంధీ దవాఖాన తరహాలో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్మస్తున్నామన్నారు. రహదారులన్నింటినీ అద్దంలా మార్చామని, త్వరలోనే భూత్పూర్ నుంచి చిన్నదర్పల్లి వరకు బైపాస్తో రాకపోకలు సులభతరమవుతాయన్నారు. సెప్టెంబర్ 2న మహబూబ్నగర్ నియోజకవర్గంలో 105 కంపెనీల ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూ నిర్వహించి అదేరోజు ఉత్తర్వులు అందజేస్తామన్నారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.10కోట్ల రుణాలకు సంబంధించిన ప్రోసిడింగ్ అందజేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మున్సిపల్ చైర్మన్ నర్సంహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.